సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులోని సీఎం కార్యాలయంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి ప్రవేశించారు. సీఎం హోదాలో తొలిసారిగా జగన్ శనివారం ఉదయం, సచివాలయంలోకి ప్రవేశించారు.
సచివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రికి వైఎస్ జగన్కి ఘనస్వాగతం పలికారు. ఉదయం 8.39 గంటలకు తన ఛాంబర్లో సీఎం అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన తన చాంబర్లోని కుర్చీపై ఆసీనులయ్యారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించిన అనంతరం సీఎం జగన్మోహన్రెడ్డి మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆశావర్కర్ల జీతాలను రూ. మూడు వేల నుంచి రూ. 10వేలకు పెంచుతూ.. తొలి సంతకం చేశారు. అనంతరం ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఫైల్పై సీఎం జగన్ మూడో సంతకం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్, ధనుంజయరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామక ష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నందిగం సురేశ్, ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, గుమ్మనూరు జయరాం తదితరులు సీఎం వైఎస్ జగన్కు అభినందనలు తెలిపారు.