దేశంలో బీజేపీ ఫుల్ స్వింగ్ లో ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగరవేసింది. కనీసం 250 స్థానాలు కూడా రావేమో అనుకుంటే ఏకంగా 303 స్థానాల్లో విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా.. బీజేపీ ఆపని చేయలేదు. మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ, దక్షిణాదిన మాత్రం పెద్దగా పట్టు సాధించలేకపోయింది. ఒక్క కర్ణాటకలో మినహా ఎక్కడ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పుడు బీజేపీ కన్ను ఆంధ్రప్రదేశ్ పై పడింది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి బలం లేదు. చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించి కాంగ్రెస్ తో చేతులు కలపడమే కాకుండా.. మోడీని, బీజేపీని విమర్శించారు.
దీంతో ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం పుంజుకోవాలని చూస్తోంది. అనంతపురం నుంచి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, మరో ఆరు నెలల కాలంలో బీజేపీ తన యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. జగన్ కు ఎలాగో ఫుల్ మెజారిటీ ఉంది. వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడానికి సుముఖంగా లేరు.
కాబట్టి బీజేపీ ఆ పని చేసేందుకు సిద్ధం అయ్యింది. వచ్చే ఆరు నెలలో తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకొని, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదాలో కూర్చోవాలని చూస్తోంది. టిడిపికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అయితే.. టిడిపి ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది. బీజేపీకి కావాల్సింది ఇదే. మరి ఈ యాక్షన్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతుందా.. చూద్దాం.