ఏపీలో జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలు కాకలు తీరి, తలలు పండిపోయిన రాజకీయ యోధానుయోధులకు సైతం షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. జగన్ అంచనాలు ఎవ్వరికి అందడం లేదు. ప్రతి ఒక్కరు ఊహించిన దానికి భిన్నంగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. జగన్ ఘనవిజయం సాధించాక అందరూ పెద్ద ఎత్తున ఆర్భాటంతో ప్రమాణస్వీకారం చేస్తారని అనుకుంటే చాలా సింపుల్గా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇక కేబినెట్లో ఖచ్చితంగా రెడ్లకు 7-10 పదవులు దక్కుతాయని అందరూ భావించారు. వైసీపీ వాళ్లు కూడా ఇదే లెక్కలు వేసుకున్నారు. అయితే వీళ్ల అంచనాలు పటాపంచలు చేస్తూ రెడ్లకు కేవలం నాలుగు బెర్త్లు మాత్రమే ఇచ్చారు. ఇక కాపులకు కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే ఉంటాయని అనుకుంటే వీళ్లకు వాళ్లే ఊహించని విధంగా నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు.
ఇదిలా ఉంటే కేవలం కేబినెట్ కూర్పులోనే కాకుండా జగన్ చీప్ విప్, విప్ పదవుల విషయంలోనూ సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు అవకాశం కల్పించారు. కీలకమైన చీప్ విప్ పదవిని తన సన్నిహితుడుకి ఇచ్చారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆ పార్టీ గనుక అధికారంలోకి వస్తే మంత్రిపదవి దక్కుతుందనే అంచనాలను కలిగి ఉన్న నేతల్లో శ్రీకాంత్ రెడ్డి ఒకరు.
సమీకరణల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి రాలేదు. అందుకే ఆయనకు చీప్ విప్ పదవి ఇచ్చారు. ఇక విప్లుగా మరో ఐదుగురిని ఎంపిక చేశారు. వీరిలో రెడ్డి వర్గానికి చెందిన చెవిరెడ్డి భాస్కరెడ్డి, కాపు వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడు, ఎస్పీ వర్గం నుంచి కొరుముట్ల శ్రీనివాసులు, బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథిలకు విప్లుగా స్థానం కల్పించారు.