ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. తాజాగా మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేశారు.ఇక కుల సమీకరణాలకు అనుగుణంగా అణగారిన వర్గాలకు న్యాయం చేస్తూ అందరి దృష్టిని తనవైపే తిప్పుకుంటున్నారు.
ఇకపై కూడా ఇదే తరహాలో సంచలన నిర్ణయాలు తీసుకోవాలని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతిలో పాలన కొనసాగిస్తూనే విశాఖపట్నం నగరాన్ని ఇందులో భాగస్వామ్యం చేయాలని జగన్ యోచిస్తున్నట్టు వినిపిస్తోంది. విశాఖను ఏపీకి రెండో రాజధానిగా ప్రకటించాలని డిసైడ్ అయినట్లు టాక్. వైఎస్సార్ సీపీ గెలుపులో ఉత్తరాంధ్ర ప్రముఖ పాత్ర వహించింది. గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, ఉత్తరాంధ్రలో ప్రజలు ఆదరించారు. అందుకే పాలనను వారికి చేరువ చేయడానికి జగన్ ఏపీ రెండో రాజధానిగా విశాఖను చేయాలని డిసైడ్ అయినట్టు వినిపిస్తోంది.
అమరావతిని క్రమంగా అభివృద్ధి చేస్తూ మరోవైపు ఏపీకి రెండో రాజధానిగా విశాఖని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీకి ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చే నగరంగా ఉన్న విశాఖపట్నం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో అక్కడ నుంచి కూడా ప్రభుత్వ పరిపాలన ఉండే విధంగా జగన్ ప్లాన్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా చేయడం అన్ని జిల్లాల వారికి రాజధానులు అందుబాటలో ఉండటంతో పరిపాలన సులభం అవుతుందని అనుకుంటున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలను ఒకసారి లేదా కుదిరితే రెండు సార్లు విశాఖలో నిర్వహించడానికి సాధ్యాసాధ్యాసాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్టు మరో టాక్. సౌకర్యాలుంటే తొందరలోనే విశాఖలో అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు. అలా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సీఎం సహా మంత్రులను కలుసుకొని తమ సమస్యలు తీర్చుకునే అవకాశాన్ని జగన్ కల్పించబోతున్నట్టు తెలిసింది. మొత్తానికి జగన్ ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారోననే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.