ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కొద్ది రోజులుగా సోషల్మీడియా పోస్టులతో సంచలనాలు క్రియేట్ చేస్తూ వస్తున్నారు. లోక్సభలో టీడీపీకి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు. చంద్రబాబు నానికి కేవలం విప్ పదవితో సరిపెట్టారు. దీంతో నొచ్చుకున్న నాని మీరు ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు... ఇంత పెద్ద పదవి చేపట్టేంత సమర్థత తనకు లేదని... దీనిని తాను తిరస్కరిస్తున్నట్టు కూడా చెప్పారు.
అంతలోనే గల్లా ఫ్యామిలీకి రెండు పదవులు ఇవ్వడంపై కూడా నాని తన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గల్లా జయదేవ్ స్వయంగా నాని ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడారు. అదే రోజు నానిని చంద్రబాబు పిలిపించుకుని సర్దిచెప్పారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత విజయవాడలో టీడీపీ ఆఫీస్ నిర్మాణ బాధ్యతలు ముందుగా కేశినేని నానికి అప్పగించి.. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన దేవినేని ఉమాకు ఇవ్వడం కూడా ఆయనకు నచ్చలేదు.
చంద్రబాబు పిలిచాక కేశినేని నాని స్లో అవుతారని అందరూ భావించారు. ఈ రోజు తాజాగా నాని మరో సంచలన పోస్టు పెట్టారు. ఈ సారి వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నానిని టార్గెట్గా చేసుకుని "కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి " అని కేశినేని నాని షాకింగ్ పోస్ట్ చేశారు. ఈ పోస్టు అసలు అర్థం ఏంటో తెలియక ఎవరికి వారు జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకు నాని కొడాలి నానిని సెటైర్ వేశారా ? లేదా తన రాజకీయ ప్రత్యర్థి అయిన ఉమాను టార్గెట్ చేశారా ? అన్నది ఎవ్వరికి అర్థం కావడం లేదు.
ఏదేమైనా నాని దూకుడు మాత్రం ఆగడం లేదు. అలాగే తన పార్లమెంటు నియోకవర్గ పరిధిలో ఉన్న దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఓ పోస్ట్ చేశారు. తనపై విమర్శలు చేసే వారికి వెంటనే కౌంటర్ ఇచ్చే కొడాలి నాని కేశినేని నాని పోస్టు విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో ? చూడాలి. ఇక నాని తాజా పోస్టు చూసిన వారు మాత్రం దేవినేని ఉమా రాజకీయంగా టీడీపీలో ఉన్నప్పుడు కొడాలి నాని లాంటి వాళ్లను తొక్కారు. ఇప్పుడు కేశినేని నాని లాంటి వాళ్లను ఎదగనీయడం లేదు. ఈ క్రమంలోనే ఉమా వల్లే నాని స్టేట్ వైడ్ హీరో అయ్యి మంత్రి అయ్యాడని.. పరోక్షంగా నాని ఉమాపై తన అక్కసు తీర్చుకున్నాడనే అంటున్నారు.