``ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కొత్త గవర్నర్ను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్న కేంద్రం.. ఆ పదవికి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ను ఎంపిక చేయబోతున్నారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ పోటీ చేయలేదు. ఆమెతోపాటు మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా బరిలోకి దిగలేదు. వీరిద్దరినీ గవర్నర్లుగా పంపిస్తారు`` అని జాతీయ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. దీనికి తోడుగా సోషల్ మీడియా, తెలుగులోని కొన్ని ఛానల్స్ సైతం హోరెత్తించాయి. ఈ నేపథ్యంలో.. ఏపీ గవర్నర్గా సుష్మ నియమితులయ్యారా లేదా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టమైంది.
సాక్షాత్తు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఆమె నియామకంపై స్పందించారు. ``ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని సంప్రదించింది నా ఏపీ గవర్నర్ నియామకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాను. నన్ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమించనున్నారనే ప్రచారం నిజం కాదు`` అని రెండు ట్వీట్ల ద్వారా సుష్మాస్వరాజ్ క్లారిటీ ఇచ్చేశారు.ఇదిలాఉండగా, సుష్మాస్వరాజ్ గవర్నర్ నియామకంపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సైతం వార్తల్లో నిలిచారు...'ఏపీ గవర్నర్గా నియమితులైన సుష్మాస్వరాజ్కు శుభాకాంక్షలు' అంటూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. అయితే.. కొద్దిసేపటికే ఆయన ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. కేంద్ర మంత్రి ట్వీట్ డిలిట్ చేసిన కొద్దిసేపటికి..సుష్మాస్వరాజ్ ట్వీట్ చేయడం గమనార్హం.