జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్పై వివాదస్పద వ్యాఖ్యలతో నెలల తరబడి మీడియాలో చర్చలు చేస్తూ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన కాంట్రవర్సీ క్రిటిక్ కత్తి మహేష్ ఇవాళ వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో మీడియా ఛానళ్లు అలెర్ట్ అయ్యాయి. ఏపీ సచివాలయంలో కత్తి మహేష్కు ఏం పని అంటూ ఆరా తీశాయి. అయితే ఈ రోజు ఉదయం ఏపీ సెక్రటేరియట్కు వెళ్లిన కత్తి మహేశ్ మంత్రి పెద్దిరెడ్డి చాంబర్కు వెళ్లి ఆయనకు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు.
కత్తి మహేశ్ స్వగ్రామం చిత్తూరు జిల్లా యల్లమంద. తన సొంత జిల్లా నేతకు మంత్రి పదవి దక్కడంతో ఆనందం పట్టలేని కత్తి మహేష్ ఇవాళ పెద్దిరెడ్డికి శుభాకాంక్షలు తెలపడానికి సెక్రటేరియట్ వెళ్లాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు పెద్దలతో పాటు కత్తి కూడా హాజరయ్యాడని సమాచారం. అయితే కత్తి సెక్రటేరియట్కు వెళ్లకముందు ముందు ‘అమ్మఒడి - విద్యావ్యవస్థలో మార్పు’ అనే విషయంపై 3:30 నిమిషాల నిడివి గల వీడియో చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అమ్మ ఒడి - విద్యావ్యవస్థలో మార్పు అంచెలంచెలుగానే సాధ్యమని కత్తి మహేష్ ఆ వీడియోలో అభిప్రాయపడ్డారు.
కత్తి మహేష్ గత ఏడాదిగా పలు టీవీ చానెల్స్ డిబేట్లలోనే కాకుండా తన ఫేస్బుక్ వీడియోల్లో వైసీపీకి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతూ అటు టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కత్తి మహేష్ కోరుకున్నట్లుగా వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అవడంతో ఆయన హ్యాపీ మూడ్లో ఉన్నాడు. అందుకే ఇవాళ ఏపీ సెక్రటేరియట్కు వెళ్లి తన సొంత జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపేసి వచ్చాడు.
ఇదిలా ఉంటే కత్తి మహేష్ చిత్తూరు ఎంపీ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అదేమి జరుగలేదు. అయితే పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం జనసేన ఘోర ఓటమి ఎదుర్కోవడంతో పాటు తన అభిమాన నాయకుడు వైయస్ జగన్ సీఎం కావడంతో కత్తి మహేష్ మాంచి జోష్లో ఉన్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. మొత్తంగా కత్తి మహేష్ ఇవాళ ఏపీ సెక్రటేరియట్లో కనిపించడంతో నామినేటెడ్ పదవుల్లో తనకు అవకాశం కల్పించాలని మంత్రి పెద్దిరెడ్డిని కోరడానికే వెళ్లినట్లు మీడియా సర్కిళ్లలో ఊహాగానాలు వస్తున్నాయి. మొత్తానికి ఏపీ సెక్రటేరియట్లో ప్రత్యక్షమవడం ద్వారా కత్తి మహేష్ మరోసారి వార్తల్లో నిలిచాడు.