మోడీ అరాచకం తో దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకమైంది.. ఈ దేశాన్ని మతతత్వ బీజేపీ నుంచి రక్షించాలి.. అందుకోసం ఎందాకైనా పోరాడతా.. అవసరమైతే అన్ని పార్టీలను కూడగడతా.. ఇది నిన్నటి వరకు చంద్రబాబు స్టాండు..
కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తెలుగుదేశం విధానం మారిపోయింది.. ఇప్పుడు కేంద్రంలో మనది తటస్థ వైఖరి అంటూ బాబు గారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎందుకు తెలుగుదేశం విధానం ఒక్కసారిగా మారిపోయింది ?
ఎందుకు చంద్రబాబు ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకున్నారు..? చంద్రబాబు ప్రధాని మోడీ అంటే భయపడి పోతున్నాడా..? తాజా పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తుంది. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తెలుగుదేశం తన విధానం ఎందుకు మార్చుకోవాలి..?
వరుసగా రెండోసారి మోడీ ప్రధాని కాగానే బిజెపి విధానాలపై వ్యతిరేకత ఎందుకు తగ్గుతుంది ? తెలుగుదేశానికి పార్లమెంటులో సంఖ్యాబలం అంతగా లేదు కాబట్టి తటస్థ వైఖరి అవలంబించాలి అన్న వాదనలో ఎలాంటి లాజిక్కు కనిపించడం లేదు. ఉన్నదల్లా ఒక్కటే.. అనవసరంగా ప్రధాని మోదీతో ఎందుకు కయ్యం పెట్టుకోవాలి..? అనువుగాని చోట ఎందుకు అధికులం అనాలి ? అన్న ప్రాప్తకాలజ్ఞతే బాబు యూటర్న్ కు అసలు కారణం.