ఏపీ ఎన్నికల సమయంలో జగన్ బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. అధికార పార్టీ తెలుగుదేశం వివేక హత్యకేసును ఎన్నికల అంశంగా కూడా వాడుకుంది. ఇంత జరిగినా ఇప్పటికీ పోలీసులు వివేక హత్య కేసును ఛేదించలేకపోయారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం కొలువుదీరడం తో వివేక హత్య కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కానీ జగన్ సర్కారు కొలువుదీరి 15 రోజులు దాటినా నిన్న మొన్నటి వరకు ఎలాంటి కదలిక లేదు. అయితే తాజాగా ఈ కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది.
వివేకా హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. 23 మంది తో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అనంతపురం చిత్తూరు తిరుపతి కి చెందిన అధికారులు సిబ్బందిని నియమించారు. వీరంతా రెండు నెలలపాటు కడప ఎస్పీ ఆధ్వర్యంలో పని చేస్తారు.
అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కోసం గతంలోనే ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. తాజాగా 23 మంది తో ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందం సిట్ తో సంబంధం లేకుండా దర్యాప్తు చేస్తుంది. ఈ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక వివేక కేసు దర్యాప్తు వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.