తెలుగుదేశం పార్టీ ఇటీవల కాలంలో ఎన్నడూ లేని పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసలే ఘోర పరాజయంతో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ నేతలు ఇప్పుడు బిజెపిలో చేరేందుకు తహతహలాడుతున్నారు.. కేవలం ఒకటి రెండు రోజుల్లోనే పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి.
ఓ వైపు రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అంతా బిజెపి వైపు చూస్తున్నారు. బిజెపి పక్కా ప్లాన్ తోనే ఈ రాజకీయం చేసినట్టు కనిపిస్తుండగా... ఇందుకు చంద్రబాబు నిర్లక్ష్యం కూడా మరో కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు ఉంటాయని అంతా వూహించిన విషయమే. కానీ బాబు మాత్రం కమలం వ్యూహాలను సరిగ్గా ఎదుర్కొనే ప్రయత్నం చేయలేదు. ఓ వైపు బిజెపి, మరోవైపు వైసిపి టిడిపిని టార్గెట్ చేస్తాయని తెలిసినా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.
తెలుగుదేశం నేతలను ఆకర్షించేందుకు బిజెపి పదిహేను రోజుల నుంచి ప్రయత్నిస్తోందన్న వార్తలు పత్రికల్లో ప్రముఖంగా నే వచ్చాయి. చంద్రబాబు మాత్రం వాటిని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. కీలకమైన సమయంలో ఆయన కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లడం కూడా పార్టీలో వలసల జోరు కు ఆజ్యం పోసింది. మరి చంద్రబాబు ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి..!