కలెక్టర్ల సదస్సు వేదికగా...ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలనాలు కొనసాగుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు వెలువరిస్తున్నారు. తాజాగా ఆయన రైతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైయస్సార్ రైతు భరోసాను ఒకే రోజు ఇద్దామని ప్రకటించారు. ``రైతు భరోసాను ఒక పండుగలా చేద్దాం. వాస్తవంగా మేలో ఇవ్వాలి కాని రైతుల దుస్థితిని చూసి అక్టోబరులో రబీ సీజన్ కోసం ఇస్తున్నాం. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయనున్నాం. 1.25 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు 50శాతం ఉన్నారు, 2.5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న భూమి ఉన్న రైతులు 70శాతానికి పైగా ఉన్నారు. 50శాతం మంది రైతులకు కావాల్సిన పూర్తిపెట్టుబడి రైతు భరోసా ద్వారా అందుతున్నట్టే...అక్టోబరు 15 న రైతు భరోసా అందుతుంది.`` అని వెల్లడించారు.
స్టాంపు పేపర్ ఫార్ములా మాదిరిగానే ఒక పత్రాన్ని కౌలు రైతుల కోసం గ్రామ సచివాలయంలో ఉంచుతామని జగన్ ప్రకటించారు. ``11నెలల కాలానికి భూమిపై హక్కులు కాకుండా, పంట సాగుచేసేకునేలా ఒక అనువతులు రైతులనుంచి కౌలురైతులకు అందేలా చూడాలన్నది ఆలోచన. దీనివల్ల కౌలు రైతులకు కొంత మంచి చేయాలన్నది ఆలోచన. కౌలు రైతులు కూడా డైనమిక్గా ఉంటారు. దీనివల్ల కౌలు రైతులు ఎక్కడున్నారు, ఏ భూమి సాగుచేస్తున్నారు తదితర విషయాలపై స్పష్టత ఉంటుంది. బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనార్టీ కౌలు రైతులకు కూడా రూ.12500 ఇచ్చే ఏర్పాటు ఆత్మహత్య చేసుకున్న రైతులకు గత ప్రభుత్వం సరిగ్గా పరిహారం ఇవ్వలేదు. ఈ పరిస్థితులు మార్చ బోతున్నాం`` అని ప్రకటించారు.
రైతు కుటుంబాలకు ఏం జరిగినా... ఆత్మహత్య జరిగినా, ప్రమాదంలో మరణించినా ... కలెక్టర్ వెంటనే స్పందించాలని జగన్ కోరారు. ``ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో పనిలేదు వెంటనే స్పందించి ఆ కుటుంబం దక్కరకు వెళ్లాలి. పలానా రైతు కుటంబం వద్దకు కలెక్టర్ వెళ్లారని పత్రికల్లో రావాలి. స్థానిక ఎమ్మెల్యేను కూడా కలుపుకుని, రూ.7 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి. సీఎం గారు అదేపనిగా చెప్పి మీకు తోడుగా నిలవమన్నారని చెప్పి... మీరు ఆ కుటుంబానికి సహాయం చేయండి. దీనిపై అసెంబ్లీలో కూడా మేం చట్టం తీసుకు వస్తాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వేధిస్తే చర్యలు తీసుకుంటామని చట్టంలో పెడతాం`` అని ప్రకటించారు. మినీ గోకులాలకు ఇవ్వాల్సిన సబ్సిడీ పెండింగ్లో పెట్టారని అధికారులు వెల్లడించారు. మినీ గోకులాలన్నీ టీడీపీ కార్యకర్తలకు ఇచ్చారని మంత్రి రంగనాథరాజు వెల్లడించారు. గోకులాలు కట్టి ఉంటే, ఇవ్వాల్సిన సబ్సిడీ సొమ్మును పార్టీలు చూడకుండా ఇచ్చేయమని సీఎం సంచలన ప్రకటన చేశారు. తద్వారా తెలుగుదేశం పార్టీ నేతల స్వార్థపూరిత రాజకీయాలకు చెక్ పెట్టారు.