ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ విజయం సాధించినప్పటి నుండి  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇప్పటికే పలు మార్లు కలిసారు. గతంలో కలిసిన వీరిద్దరు విభజన హామీలలో ఉన్న విభజన అంశాలపై చర్చించుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించారు. తాజాగా కృష్ణా నది వరద నీటిని సముద్రంలోకి విడుదలపై మరోమారు ఇద్దరు భేటీ కానున్నారు.

ఈ నెల 28న సమావేశం గురించి అధికారికంగా సమాచారం లేకున్నా సీఎంల సూచన మేరకు రెండు రాష్ట్రాల అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌తోనూ, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుతో చర్చించారు. నీటిని మళ్లించే ప్రతిపాదనల గురించి ప్రస్తుతం రెండు రాష్ట్రాల ఇంజినీర్లు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకొంటున్నారు.

గోదావరి వరద నీటిని కృష్ణా నదిలోకి మళ్లించాలన్న యోచనకు పదును పెరుగుతోంది. పలు ఆలోచనలపై కసరత్తు చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యంగా మూడు రకాల ఆలోచనలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు ఎక్కువ నీటి వినియోగం జరగాలంటే గోదావరి నీటిని ఎక్కడి నుంచి మళ్లించేలా చేపడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నదానిపై చర్చిస్తున్నారు.

గోదావరి వరద నీటిని శ్రీశైలానికి మళ్లించడంపైనే ముఖ్యమంత్రుల మధ్య ప్రధాన చర్చ ఉంటుందని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. వరద ఉండే మూడు నెలల సమయంలో 250 నుంచి 300 టీఎంసీల నీటిని మళ్లించడమే లక్ష్యంగా కొత్త పథకానికి రూపకల్పన చేయాలన్నది యోచనగా చెప్తున్నారు. నీటి అవసరం ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం, కృష్ణాలో లభ్యమయ్యేనీరు, అదనంగా ఎంతమేరకు అవసరం అన్నదాని ఆధారంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. జల వివాదాలకు సంబంధించిన ఇతర అంశాలకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య  గోదావరి జలాల వినియోగంపై చర్చ జరిగింది. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని, ఇక్కడి నుంచి నేరుగా శ్రీశైలానికి నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుందని, పూర్తి సహకారంతో కరవు జిల్లాలకు గోదావరి వరద జలాలను వినియోగించుకోవచ్చన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీనిపై ఉన్నతస్థాయి అధికారులతో కూడా ఆయన చర్చించారు. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం నీటి మళ్లింపు సామర్థ్యాన్ని రోజుకు ఒక టీఎంసీకి పెంచడంపైనా ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ నెల 28న హైదరాబాద్‌లో సమావేశం కావాలని నిర్ణయించిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఇందుకు సంబంధించిన ఎజెండా ఇతర అంశాలపై సిద్ధం కావాలని అధికారులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: