వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం చరిత్రాత్మక ఘట్టమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నీలం వెంకటేశం అధ్యక్షతన రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బీసీ బిల్లుకు మద్దతుగా 93 బీసీ కులాలు, 30 సంఘాల విద్యార్థి, యువజన, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య బీసీ బిల్లును ప్రవేశపెట్టడంతో ప్రత్యేక శ్రద్ధ చూపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డిని అభినందించారు. పార్లమెంట్లో ఉన్న 92 మంది బీసీ సభ్యులు వారిని చూసి నేర్చుకోవాలని, ఇప్పటికైనా వారికి పూర్తి మద్దతు పలకాలని కోరారు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని గతంలోనే కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసి కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
బీజేపీ కూడా బిల్లుకు మద్దతు ఇస్తూ బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్లుకు తాము మద్దతివ్వకూడదనుకుంటే వారే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని సూచించారు. త్వరలోనే బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో పాటు అన్ని పార్టీల ప్రతినిధులను, పార్లమెంట్ సభ్యులను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. బీసీ బిల్లు పాసైతేనే ఎస్సీ, ఎస్టీలతో సమానంగా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు వర్తిస్తాయన్నారు.
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 30 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నామని, పార్లమెంట్వద్ద ఎన్నోసార్లు ధర్నాలు చేశామని, 40 సార్లు ప్రధానమంత్రిని కలిసి చర్చించినట్లు ఆయన గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందించి బిల్లు పెట్టారని దీనిని ఆమోదింపజేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు.