టీడీపీ వివాదాల నేత, పశ్చిమగోదావరి జిల్లా దెందూలూరు మాజీ ఎమ్మెల్యే చింతమేనని ప్రభాకర్కు కష్టాలు మొదలయ్యాయి. ఏపీలో టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు ఐదేళ్లలో చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు, కుమార్తె చేసిన అరచకాలపై ప్రజలు, వారి బాధితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఐదేళ్ల విప్గా ఎన్నో అరాచకాలు చేసిన చింతమనేని ప్రభాకర్కు కూడా ఇప్పుడు చింతలు మొదలయ్యాయి.
ఇప్పటికే చింతమనేనిపై వ్యవసాయ పైపులు దొంగలించినట్లు పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పశుసంవర్థక శాఖలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేత, ప్రస్తుత దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఈ రోజు ఆరోపించారు. చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దెందులూరు నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
ఈ క్రమంలోనే పశుసంవర్థక శాఖ ప్రజలకు అందించాల్సిన ఫలాలను చింతమనేని కుటుంబం అక్రమంగా పొందిందని అబ్బయ్యచౌదరి విమర్శించారు. పశుసంవర్థక శాఖ లబ్ధిదారుల జాబితాలో చింతమనేని ప్రభాకర్ భార్య, తండ్రి కేశవరావుల పేర్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన ఈ విషయాన్ని పశుసంవర్థక శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఫిర్యాదు చేయగా.. బోస్ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ అక్రమాలపై త్వరగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని బోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.