అక్టోబర్ నుండి అమల్లోకి రానున్న కొత్త ఎక్సైజ్ పాలసీలో మరిన్ని కొత్త ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. అందులో భాగంగా.. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని ఆలోచిస్తోంది. గతంలో ఈ తరహా యోచన చేసిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైన సంగతి తెలిసిందే. కాగా ఈ కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా ప్రభుత్వ మద్యం షాపుల నిర్వహణ కోసం సిబ్బందిని నియమించుకోనున్నట్టు తెలిసింది. అయితే గతంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన వందలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడి ఇప్పటికీ తమకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
మద్యం విక్రయాల్లో సమయాన్ని నిర్ధేశించినట్టైతే సిబ్బంది పనివిధానం కూడా సులభతరం అవుతుందనేది మరో ఆలోచన. ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అంటే రెండు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేయాల్సి వస్తుంది. కానీ అది ప్రభుత్వానికి అదనపు భారం అవటమే కాకుండా వేతనాల భారం కూడా పెరగనుంది. ఈ నేపద్యంలో సాయంత్రం 6గంటల వరకు అమ్మకాలను కుదిస్తే ఒకే షిఫ్టుతో సిబ్బందితో పనిచేయించుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.