కర్ణాటకలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొన్నటి ఎలాగోలా నెట్టుకు వచ్చినా ఇప్పుడు ఆ పప్పులు ఉడకలేదు. కర్ణాటకలో 16 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎంత బుజ్జగించినా వీరు వినే పరిస్థితుల్లో లేరు. రాజీనామాలు సమర్పించిన ఈ ఎమ్మెల్యేలు ముంబై వెళ్లారు.
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అక్కడ రక్షణ దొరికింది. అక్కడి నుంచి వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో మరో మలుపు తీరింది. ఈరోజు సాయంత్రంలోగా 16 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
దీంతో 16 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు రాబోతున్నారు. కర్ణాటకలో ఈ స్థాయిలో సంక్షోభం రావడానికి కారణం ఒకే ఒక్కడు. ఆయనే ఉమేష్ జాదవ్. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఉమేష్ జాదవ్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్.. జేడీఎస్ కూటమి బుజ్జగించడంతో పాటు ఫిరాయింపుల చట్టం ప్రయోగిస్తామని చెప్పడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు వెనక్కి తీసుకున్నారు.
జాదవ్ తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి మార్చుకోలేదు. బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు. పార్లమెంట్ ఎన్నికల్లో జాదవ్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే పై విజయం సాధించాడు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ లపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అర్ధం చేసుకున్న అసమ్మతి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి రాజీనామాలు చేశారు. ఉమేష్ జాదవ్ ఇచ్చిన స్ఫూర్తి తో మరికొంతమంది కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈరోజు రాత్రికి కర్ణాటకలో రాజకీయంగా పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది.