సుదీర్ఘ‌కాలంగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డ‌నుంది. గురువారం అసెంబ్లీలో ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కొనే సమయంలో సభకు తప్పనిసరిగా హాజరు కావాలని రెబెల్ ఎమ్మెల్యేలను తాము బలవంతంగా ఆదేశించజాలమని సుప్రీంకోర్టు పేర్కొంది. కర్ణాటక సంక్షోభంపై సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన తాత్కాలిక తీర్పు సీఎం కుమారస్వామి ప్రభుత్వానికి ‘ అగ్నిపరీక్షేన‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  దీంతో ప్రాక్టికల్ గా ‘ విప్ ‘ ఆదేశాల నుంచి వారికి ‘ రక్షణ ‘ లభించినట్టే.. వీరి రాజీనామాలపై స్పీకర్ దే తుది నిర్ణయమంటూ అత్యున్నత న్యాయస్థానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్, జేడీ-ఎస్ పార్టీలు జారీ చేసిన విప్ నుంచి వీరికి రిలీఫ్ దొరికింది. అంటే విప్ ఆదేశాలను వారు ధిక్కరించవచ్ఛు.


చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యాన గల ముగ్గురు సభ్యుల బెంచ్.. స్పీకర్ ను ఆదేశించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన 27 ఏళ్ళ నాటి ఓ కేసును ప్రస్తావించారు. ఆ కేసులో… నాడు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 1985 నాటి 52 వ రాజ్యాంగ సవరణను పరిశీలించిందని పేర్కొన్నారు. ఆ సవరణలో రాజ్యాంగంలోని 10 వ షెడ్యూల్ ని చేర్చారని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించిందని అన్నారు. అదే ఆ తరువాత పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంగా మారిందన్నారు. ఆ సవరణ సక్రమమేనని 5 గురు జడ్జీల ధర్మాసనం తీర్పునిచ్చిన విషయాన్ని సింఘ్వీ గుర్తు చేశారు. ఒక ఎమ్మెల్యే రాజీనామా పైనో, అనర్హత పైనో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ దేనని వారు తీర్పునిచ్చారని అన్నారు.


ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో సహా మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన నేపథ్యంలో.. వారు విశ్వాస తీర్మానానికి హాజరు కాకపోతే.. స్పీకర్ రమేష్ కుమార్ తో బాటు సభలో సభ్యుల సంఖ్య 207 కు తగ్గిపోతుంది. ట్రస్ట్ ఓట్ చేపట్టేంతవరకు ‘ ఈక్వేషన్ ‘ మారని పక్షంలో మెజారిటీ మార్క్ .. మినిమమ్.. 103 అవుతుంది. అప్పుడు కాంగ్రెస్, జేడీ-ఎస్ సంకీర్ణానికి వారి తరఫు నుంచి కేవలం 100 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. సభలో బీజేపీ బలం 105. వీరికి ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతునిస్తే ఈ సంఖ్య 107 కు పెరుగుతుంది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసినా.. ‘ సరైన సమయంలో ‘ ఆయన వారి విషయంలో తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని మెలిక పెట్టింది.
కాగా, రేపటి అసెంబ్లీకి తాము హాజరు కాబోమని 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించడంతో కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడం ఖాయమని అంటున్నారు. ఆయన ఇక గద్దె దిగడం వాస్తవమవుతుందని మాజీ సీఎం, బీజేపీ నేత య‌డ్యూరప్ప వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు రెబెల్ ఎమ్మెల్యేలకు నైతిక విజయమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సీఎం కుమారస్వామి..సుప్రీం తీర్పుపై స్పందించలేదు. తన ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన నిన్నటివరకు గంభీరంగా..ధీమాగా ఉండగా. బుధవారం కోర్టు ఇచ్చిన తీర్పుతో హతాశులైనట్టు కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: