యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగిన బ్రెగ్జిట్ నేపథ్యంలో మొదలైన రాజకీయ ప్రకంపనల పరంపరలో...మాజీ విదేశాంగ మంత్రి, లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ తాజాగా ప్రధాని పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నూతన ప్రభుత్వంలో భారతీయ సంతతికి చెందిన ప్రీతి పటేల్...బ్రిటన్ హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మాజీ ప్రధాని థెరిసా మే బ్రిగ్జిట్ వ్యూహాలను వ్యతిరేకించిన ఆమెకు.. కొత్త ప్రధాని బోరిస్ జాన్సన్ తన క్యాబినెట్లో ప్రీతికి పెద్ద పోస్టే ఇచ్చారు. గుజరాతీ మూలాలు ఉన్న ఆమె.. బ్రిటన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
గతంలో బోరిస్ జాన్సన్ కోసం కనర్జర్వేటివ్ పార్టీ తరపున ప్రీతి ప్రచారం చేశారు. 2010లో ఎసెక్స్లోని వీథమ్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ నుంచి ప్రీతి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ బృందంలో ఆమె కీలక పాత్ర పోషించారు. గతంలో జూనియర్ మినిస్టర్గా ఆమె అనేక బాధ్యతలు చేపట్టారు. 2014లో ట్రెజరీ మంత్రిగా, 2015లో ఎంప్లాయిమెంట్ మినిస్టర్గా చేశారు. థెరిసా మే పాలనలో విదేశాంగ కార్యదర్శిగా చేశారు. అయితే 2017లో ప్రీతి ఆ పదవికి రిజైన్ చేశారు. ఇజ్రాయిలీ నేతలతో అనధికారికంగా వరుస సమావేశాలు నిర్వహించిన ఘటనలో ఆమెకు ఉద్వాసన పలికారు. నూతన ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలో బ్రిటన్ అభివృద్ధి చెందుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
2016 లో బ్రెగ్జిట్ తీర్మానం వీగిపోవడంతో డేవిడ్ కామెరాన్ స్థానంలో థెరెసా మే ప్రధాని పగ్గాలు చేపట్టారు. కానీ బ్రెగ్జిట్పై అందరి మద్దతు కూడగట్టడంలో విఫలమై ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. దీంతో ప్రధాని పదవి కోసం పలువురు కేబినెట్ మంత్రులు పోటీపడ్డారు. మాజీ విదేశాంగ మంత్రి, లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ పైచేయి సాధించారు. 1,59,320 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో 87.4% మంది ఓటు వేయగా, జాన్సన్కు 92,153 ఓట్లు (66%), గట్టి పోటీ ఇస్తారని భావించిన విదేశాంగ మంత్రి జెరెమీ హంట్కు 46,655 ఓట్లు వచ్చాయి.