ఏపీలో అధికార వైసీపీకి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ సైతం ఊహించని విజయం దక్కింది. వీరిలో చాలా మంది సీనియర్లు, జగన్ కోసం, పార్టీ కోసం త్యాగాలు చేసిన వారు ఉన్నారు. దీంతో వీరిలో ఎవరికి పదవులు ఇవ్వాలో ? తెలియక జగన్ తీవ్రంగా సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే పదవులు వచ్చిన వాళ్లకే ఒకటి రెండు పదవులు వస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా వైసీపీలో నెలకొన్న కొత్త పంచాయతీతో జగన్కు పెద్ద తలనొప్పిగా మారిందట.
అసలు మ్యాటర్ ఏంటంటే సీనియర్ ఎమ్మెల్యేల వల్ల కొత్తగా బాధ్యతలు చేపట్టిన జూనియర్ మంత్రులు తెగ ఇబ్బంది పడుతున్నారట. సీనియర్ ఎమ్మెల్యేల ముందు కొత్త జూనియర్ మంత్రులు కుర్రాళ్లు. జగన్ కేబినెట్లో రాజకీయ అనుభవం తక్కువుగా ఉన్నవాళ్లు కూడా మంత్రులు అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పదవులు రాని సీనియర్ ఎమ్మెల్యేలు వీళ్లను ఏ మాత్రం లెక్క చేయడం లేదట. మీరు ఎక్కడ ఏమైనా చేసుకోండి... నా నియోజకవర్గంలో మాత్రం నాకు తెలియకుండా చీమ చిటుక్కుమన్నా ఊరుకోనని ఖరాఖండీగా చెప్పేస్తున్నారట.
ఒక రకంగా సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుండడంతో వీళ్లంతా వీళ్లతో మనకెందుకొచ్చిన గొడవరా ? బాబు అని వాళ్లే సర్దుకుపోవాల్సిన పరిస్థితి వచ్చిందట. కొన్నిసార్లు నిబంధనలు అతిక్రమించి మరీ ట్రాన్స్ఫర్లు చేయాలని ఒత్తిడి చేస్తుండడంతో జూనియర్ మంత్రులు సీనియర్లను ఏమీ అనలేక వాళ్లు చెప్పినట్టే చేస్తున్నారట. చివరకు ఈ పంచాయతీ సీఎం జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళ్లడంతో జగన్ కొత్త మంత్రులు, సీనియర్లు సమన్వయం చేసుకుని వెళ్లాలని సూచించారట.