జగన్ ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా ఎదిగాడు, కుట్రలు, కుతంత్రాల మధ్యన ఆయన రాజకీయ జీవిత ప్రయాణం మొదలై అలా సాగుతోంది. జగన్ కి రాజకీయం ఏంటో తెలుసు కానీ రాజకీయ వ్యూహాలు తెలియవంటారు. ఆయనది అంతా ముక్కుసూటి వ్యవహారం. మరి జగన్ లో ఒక రకమైన మొండితనం కూడా ఉంది. ఆయనలో ఆత్మవిశ్వాసం పాలు కూడా ఎక్కువే. తానే అన్నీ అంటారు, తానే అంతా అంటారు. అది ఇతరులకు గర్వంగా కూడా కనిపించవచ్చు.


నిజానికి పదేళ్ళ పోరాటం తరువాత ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయనకు  అధికారం  కష్టార్జితం. ఎవరి దయా ధర్మం కానే కాదు. తన రెక్కల కష్టంతోనే జగన్ ఓట్లూ, సీట్లు గెలుచుకున్నారు. పార్టీ పెట్టిన తరువాత అనేక ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జగన్ 2014, 2019 సార్వత్రిక ఎన్నికలను కూడా ఒంటి చేత్తో ఎదుర్కొన్నవాడు.  ఆయన ఎపుడూ పొత్తుల కోసం వెంపర్లాడలేదు.

లోపాయికారీ రాజకీయాలు, రాజీలు జగన్ కి అంతకంటే తెలియవన్నది అందరికీ అర్ధమైన విషయమే. అదే తెలిస్తే ఆయన కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వస్తారు. నానా బాధలు పడతారు. అందువల్ల జగన్ విజయం ఆయన స్వార్జితం. ఇందులో ఎవరు ఎన్ని చెప్పినా అది అసూయతో అంటున్న మాటలుగానే చూడాలి.


మరి బీజేపీ ఓట్లతోనే ఏపీలో జగన్ గెలిచాడట. ఇంత నిబ్బరంగా అన్నది ఎవరో కాదు ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ డియోధర్. ఏపీలో బీజేపీకి పడాల్సిన ఓట్లు కూడా టీడీపీ మళ్ళీ రాకూడదన్న ఆలోచనతో జగన్ కి పడ్డాయట. అలా తమ ఓట్లు 20 శాతం కలిస్తేనే జగన్ కి ఇన్ని సీట్లు, ఓట్లూ దక్కాయని సునీల్ అంటున్నారు.  ఏపీలో జగన్ని ఎంతలా తీసిపారేగలమో అంతలా మాటలు తూలుతున్నారు కమలనాధులు


మరో బీజేపీ నేత రాం మాధవ్ ఏపీలో వైసీపీ పాలన పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందని అంటున్నారు. జగన్ అంటే జనం భయపడుతున్నారట. వైసీపీ ఏలుబడిలో మేలు కంటే కీడే ఎక్కువట. ఇవన్నీ బాగానే ఉన్నా అసలు జగన్ అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయిందని ఇంతలేసి మాటలంటున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చేయాలన్న ఆరాటం బీజేపీకి ఎక్కువై ఇలా మాట్లాడిస్తుందనుకోవాలేమో. 


 ఏపీలో పొలిటికల్  సీన్ బీజేపీ  భావిస్తున్నట్లుగా అసలు లేదు. చంద్రబాబు ఓడిపోయారు కాబట్టి ఏపీ మాదే, జగన్ని పక్కన పెట్టాల్సిందే. ఇదీ ఇపుడు కాషాయ పార్టీ కదన కుతూహలం. మొదట్లో 2029లో ఏపీలో అధికారం అన్నారు, నిన్నటి వరకూ 2024లో ఏపీలో గెలుస్తామని చెప్పారు. కర్నాటకలో కూటమి కూలిపోయాక ఇపుడు  ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అంటున్నారు. అంటే జగన్ని అయిదేళ్ళూ తిన్నగా పాలన చేసుకోనివ్వరా ఏంటి. ఈ డౌటే ఇపుడు వైసీపీ నేతలను పట్టి పీడిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: