జగన్ సర్కారు అతి తక్కువ కాలంలోనే అనేక పనులు ప్రారంభించింది. జగన్ సాధ్యమైనంత త్వరగా పరిపాలనపై తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు.అందులో భాగంగా ఆయన జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వాస్తవానికి ఇంత స్పీడ్ ను జగన్ ప్రత్యర్థులు ఊహించలేదు. అనుభవం లేదు. పరిపాలన చేతకాదు.. ఏదో మెల్లగా బండి నడిపిస్తే అదే ఎక్కువ అని భావించారు. కానీ జగన్ స్పీడ్ చూశాక గానీ వారికి దిమ్మతిరగలేదు. అందుకే అర్జంటుగా తమ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారాలు ప్రారంభించేశారు.
అందులో తాజాగా విశాఖ నుంచి ఐటీ ఉద్యోగాలు వెళ్లిపోతున్నాయన్నది ఓ ప్రచారం.. విశాఖ ఐబిఎమ్ లో ఉద్యోగాలు పోతున్నాయన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఇక్కడ ఓ విషయం గమనించాల్సి ఉంది. ఐటీ రంగంలో అవసరం మేరకు ఉద్యోగాలను తగ్గించుకోవడం ఎప్పటి నుంచో ఉంది. ఇది కొత్త వ్యవహారమేమీ కాదు.
చంద్రబాబు హయాంలో వచ్చిన అతి కొద్ది కంపెనీలు కోట్ల విలువైన భూములనైతే హస్తగతం చేసుకున్నాయి కానీ ఇస్తామన్న వేలాది ఉద్యోగాలు ఇవ్వనేలేదు. కానీ ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని ఎల్లో మీడియా ఇంకేముంది మంగళగిరి ఐటీ హబ్ అయిపోయింది అని వార్తలు ఇచ్చేశాయి. ప్రత్యేక కథనాలతో దుమ్మురేపాయి.
అయితే బాబు హయాంలో వచ్చిన కొన్ని కంపెనీలు తమ కార్యకలాపాలు కూడా ఇంతవరకూ ప్రారంభించలేదు. ఇక ఐటీ సెక్టార్ కోసం రాష్ట్ర ప్రభుత్వ చేసిన కేటాయింపులు, పెట్టిన ఖర్చుతో పోలిస్తే వచ్చి ఉద్యోగాలు అతి స్వల్పం. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి బుగ్గన సాక్ష్యాలతో సహా శాసన సభలో వివరించారు. ఆ సమయంలో తెలుగుదేశం సభ్యులకు నోటమాట రాలేదు.
అందుకే జగన్ సర్కారుపై ఏదో ఒక రకంగా బురద జల్లడాన్ని ఎల్లో పత్రికలు పెట్టుకున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం గమనించాలి. ఇలాంటి కథనాలు చూసి జనం ఓ అంచనాకు వచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఎందుకంటే గతంలో ఇంతకంటే ఎక్కువగా ఎల్లో ప్రచారం సాగినా జగన్ అధికారంలోకి రావడమే అందుకు ఉదాహరణ.