వీజీ సిద్ధార్థ. ఆ పేరే ఒక మహత్తు.. కాఫీ తాగినంత మత్తు. పుట్టుకతోనే శ్రీమంతుడైనా.. జీవితాన్ని సవాలుగా తీసుకున్నాడు. కొండల్లోని కాఫీ తోటల్ని.. నగరాల్లో ‘కాఫీ డే’లుగా మార్చిన వ్యాపార మాంత్రికుడు.

కర్ణాటకలోని చిక్మగళూర్‌లో మూడొందల ఎకరాల కాఫీ తోటలకు వారసుడు సిద్ధార్థ. కష్టాలనేవి తెలీకుండా పెరిగాడు.   దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులంటే సిద్ధార్థకు గౌరవం. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక.. సైన్యంలోకి వెళదామని డిఫెన్స్‌ అకాడమీ పరీక్ష రాశాడు. ఉత్తీర్ణుడు కాలేదు. చేసేది లేక మంగళూరుకు వెళ్లి అర్థశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశాడు. ఒక రోజు ‘నేను స్టాక్‌మార్కెట్‌పై శిక్షణ కోసం బొంబాయి వెళ్లాలనుకుంటున్నా..’ అని చెప్పాడు తల్లిదండ్రులతో. కాఫీ తోటలు చూసుకుంటాడనుకున్న కొడుకు ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ఎంతచెప్పినా వినలేదు. ఆఖరికి తండ్రి సిద్ధార్థ చేతిలో కొంత డబ్బు పెట్టి సాగనంపాడు.


అవి 1983 నాటి రోజులు. రెండు బస్సులు మారి చిక్మగళూర్‌ నుంచి బొంబాయి చేరుకున్నాడు. చేతినిండా డబ్బున్నా.. దాని విలువ తెలుసు కాబట్టి.. చిన్న లాడ్జిలో దిగాడు. నారిమన్‌ పాయింట్‌లోని బహుళ అంతస్థుల భవనం చేరుకునేందుకు.. లిప్ట్‌ ఎక్కడం అదే తొలిసారి. లిఫ్ట్‌లో భయపడిపోయి, బయటికొచ్చి మెట్లు ఎక్కాడు. అందులోని ఒక ఆఫీసుకి వెళ్లి రిసెప్షనిస్టుతో.. ‘నేను కర్ణాటక నుంచి వచ్చాను. మహేష్‌ కంపానీ గారిని కలవాలి..’ అనడిగాడు.


 ఒక్క అవకాశం

‘ఆయన్ని కలవడానికి కొన్ని రోజుల నుంచి ఎదురుచూసేవాళ్లు చాలామందే ఉన్నారు. నువ్విప్పుడొచ్చి కలుస్తానంటే కుదరదు. నెల రోజుల ముందు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నా కష్టమే’ అంది రిసెప్షనిస్టు. పదే పదే బతిమాలితే ఆయన గదిలోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ‘సార్‌, మీ గురించి చాలా చదివాను.. విన్నాను. నేను ఎకనామిక్స్‌ పట్టభద్రుణ్ణి. చేస్తే  మీ దగ్గరే శిష్యరికం చేయాలి. లేదంటే మా ఊరెళ్లి, నాకిష్టం లేకపోయినా.. కాఫీ తోటలు సాగు చేయక తప్పదు. ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ వినయంగా వేడుకున్నాడు. సిద్ధార్థ అంకితభావాన్ని చూసి.. చిరునవ్వుతో ఒకే అన్నాడు మహేష్‌ కంపాని. బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి ప్రెసిడెంట్‌, జేఎం క్యాపిటల్‌ అధినేత అయిన ఆయన దగ్గర ఎంతైనా నేర్చుకోవచ్చన్నది సిద్ధూ ఆలోచన.


గురువు మాటపై గురి

స్టాక్‌మార్కెట్‌లో పాఠాలు, ట్రేడింగ్‌ మెలకువలు ఆపోసన పట్టాడు. సిద్ధార్థ  పట్టుదలకు ముగ్ధుడయ్యాడు కంపానీ. ఆయన చెప్పిన ఒక సూత్రం- ‘షేర్‌మార్కెట్‌లో ఉద్వేగం పనికి రాదు. ఆస్తులు అమ్మి షేర్లను కొనకూడదు. షేర్లలో వచ్చిన లాభాల్లో సగం సొమ్మును రియల్‌ఎస్టేట్‌కు మళ్లిస్తుండాలి. అప్పుడే పైకొస్తాం’. గురువు మాటపై గురి కుదిరింది. స్టాక్‌మార్కెట్‌ గురించి కొంత అవగాహన వచ్చాక తిరిగి సొంతూరు చేరుకున్నాడు. బొంబాయి నుంచి కొడుకు వచ్చేశాడన్న సంతోషం ఎక్కువసేపు నిలువలేదు తల్లిదండ్రులకు. ఎందుకంటే రావడం రావడంతోనే ‘నేను బెంగళూరులో స్టాక్‌ బ్రోకర్‌ బిజినెస్‌ చేద్దామనుకుంటున్నా. డబ్బు కావాలి’ అనడిగాడు సిద్ధార్థ. తల్లిదండ్రులు చేసేది లేక.. ఏడున్నర లక్షలు చేతికిచ్చి.. ‘ఒకవేళ వ్యాపారంలో నష్టపోతే.. తిరిగొచ్చి కాఫీ తోటలు చూసుకో’ అని చెప్పి పంపించారు.


మూడువేల ఎకరాలు

అమ్మానాన్నలిచ్చిన భరోసానే కొండంత ధైర్యం.ఐదు లక్షలు పెట్టి బెంగళూరులో స్థలం కొన్నాడు. ఒకవేళ స్టాక్‌మార్కెట్‌లో నష్టపోతే.. తాను కొన్న స్థలం ధర పెరిగి.. పెట్టుబడికి ఢోకా రాదన్నది అతని ఆలోచన. ఆ ధైర్యంతోనే శివన్‌ సెక్యూరిటీస్‌ అనే స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీని ప్రారంభించాడు. బొంబాయిలో సంపాదించిన పరిజ్ఞానం ఇక్కడ పనికొచ్చింది. వచ్చిన లాభాలతో చిక్మగళూరులో కాఫీ తోటలు కొనేవాడు.  1985 నుంచి 1993 వరకు సుమారు మూడువేల ఎకరాల కాఫీ తోటల్ని కొనడం సిద్ధార్థ సాధించిన పెద్ద విజయం.


 ఇంటర్‌నెట్‌ బీర్‌ కెఫే

కేవలం వ్యవసాయానికే పరిమితమైతే లాభం లేదు. అనుబంధ వ్యాపారాల్లోను అడుగుపెట్టాలి. అమాల్గమేటెడ్‌ కాఫీ బీన్‌ కంపెనీని ప్రారంభించాడు సిద్ధార్థ. అదే సమయంలో - కాఫీ గింజల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్‌లో కరువు వచ్చింది. కాఫీ పంట బాగా తగ్గిపోయింది. ధర పెరిగింది. సిద్ధార్థ తెలివిగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ప్రపంచదేశాలకు నాణ్యమైన కాఫీ గింజల్ని ఎగుమతి చేశాడు. రెండేళ్లు తిరక్కుండానే అతి పెద్ద కాఫీ ఎగుమతి సంస్థగా మార్చాడు. ఇక్కడితో ఆగిపోకూడదు. ఒకసారి ఏదో పని మీద సింగపూర్‌ వెళ్లాడు. అక్కడ ఇంటర్‌నెట్‌ బీర్‌ కెఫే కనిపించింది. అందులో యువతీ యువకులు ఒక చేత్తో బీరు తాగుతూ.. మరో చేత్తో కంప్యూటర్‌ బ్రౌజ్‌ చేస్తున్నారు. సిద్దార్థకు ఆ అవుట్‌లెట్‌ చాలా కొత్తగా, ఆధునిక తరాన్ని ఆకట్టుకునేలా అనిపించింది. మన దేశంలో బీరుకు బదులు కాఫీ కెఫేలు పెడితే.. అనే ఆలోచన వచ్చింది. అక్కడికక్కడే తాజా గింజల్ని మర ఆడించి.. ఘుమఘుమలాడే కాఫీని చేసివ్వడం కెఫే ప్రత్యేకత. బెంగళూరులో ఒక అవుట్‌లెట్‌తో మొదలై.. ఇప్పుడు కాఫీడే రెండువేలకు పైగా అవుట్‌లెట్లతో విస్తరించింది. కాఫీడేలు యువతరానికి అడ్డాలుగా మారాయిప్పుడు. 


.ఇంటర్‌నెట్‌ అంటే ఏమిటో తెలియని 1996లో బెంగళూరులోని బ్రిగేడ్‌ రోడ్‌లో తొలి ఇంటర్‌నెట్‌ కేఫ్‌ను ప్రారంభించారు సిద్ధార్థ, భార్య మాళవిక. తమ కేఫ్‌లోకి ఎవరు అడుగుపెడతారాని పడిగాపులుగాచేవారు. కొత్తలో ఎవరూ వచ్చేవాళ్లు కాదు. నాడు ఆయన నాటిన కాఫేడే అనే విత్తనం నేడు మహా వృక్షమై ప్రపంచ ప్రఖ్యాత స్టార్‌బక్స్‌, కోస్టా కాఫీ, మెక్కెఫేల సరసన చేరింది. పదిహేను అంతర్జాతీయ నగరాల్లో కాఫీడే విస్తరించింది. కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా అతనో సెలబ్రిటీగా మారాడు. మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కూతురితో పెళ్లయింది. పదిహేను వేల ఎకరాల కాఫీ తోటలు, మూడు వేల ఎకరాల అరటి తోటలతో.. ఆయన వ్యవసాయ వ్యాపారం వర్ధిల్లుతోంది.

‘‘ప్రతి ఉదయం నా పుస్తకాల అల్మరాను తెరచిచూస్తే కానీ, ఆ రోజు మొదలవ్వదు. బలమే జీవితం, బలహీనతే మరణం అనే వివేకానంద స్వామి సూక్తి నాకెంతో శక్తినిస్తుంది..’

అంటున్న వీజీ సిద్ధార్థ తాజా కాఫీలాంటి వాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: