ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస పెట్టి తగిన శాఖల పరంపరలో మరో అదిరిపోయే షాక్ తగలనుంది. బెజవాడ టిడిపిలో బిగ్ వికెట్ డౌన్ అయ్యేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఈ మేరకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బోండా ఉమామహేశ్వరరావు అక్కడి నుంచి రాగానే దీనిపై క్లారిటీ రానుంది.
బొండా టీడీపీ నుంచి గతంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా ఎన్నికల్లో ఆయన మల్లాది విష్ణు చేతిలో కేవలం 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. మరి బోండా ఉమామహేశ్వరరావు పార్టీలో చేరితే ఏ పదవిని అప్పగిస్తారన్న చర్చ పార్టీలో జరుగుతుంది. బోండా పార్టీ మారడంపై దాదాపు క్లారిటీ వచ్చేసిందని ఆయన సన్నిహితులు కూడా చెపుతున్నారు.
బొండా వైసీపీలో చేరితే ఆయనకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను వైసీపీ ఇవ్వటానికి ముందుకి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే అక్కడ వైసీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. అక్కడ మొన్న పోటీచేసిన బొప్పన భవకుమార్, ఎన్నికల ముందు వరకు ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తనకు పట్టున్న సెంట్రల్ సీటును కాదని తూర్పుకు వెళితే అక్కడ సీనియర్ నాయకులున్నందున.. తనకి అక్కడ సపోర్ట్ దొరకదని భావించిన బోండా ఆ బాధ్యతలను స్వీకరించడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. తూర్పు నియోజకవర్గంలో కాపుల కంటే కమ్మ సామాజికవర్గం ఓటర్లే ఎక్కువుగా ఉన్నారు. 2014లో ఇక్కడ నుంచి వైసీపీ ఇదే వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను పోటీ చేయించింది.
ఈ ఎన్నికల్లో బెజవాడ నగరంలో వైసీపీ ఒక్కరు కాపులకు కూడా సీటు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ భర్తీ చేసేందుకు బొండాకు తూర్పు బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉందట. అయితే బొండా మాత్రం తూర్పు బాధ్యతలు స్వీకరించేందుకు ససేమీరా అంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న బొండా ఉమామహేశ్వరరావు ఈ నెల 4, 5 తేదీల్లో నగరానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై పూర్తీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బొండా పార్టీ మారితే బెజవాడలో బాబుకు పెద్ద షాక్ లాంటిదే.