ఉత్త తెలంగాణను బంగారు తెలంగాణ చేసుడే మన లక్ష్యం అని కేసీఆర్ గత ఐదారేళ్ళ నుండి అలుపు సొలుపు లేకుండా తెగ పనిచేసేస్తుండు, కాకుంటే బంగారు ప్లేసులో అప్పు అనే పదం వచ్చి చేరింది అంతే. దానికి మన కేసీయోడు ఏం చేస్తడు పాపం. అయినా భారత్ దేశంలో అప్పు లేకపోతే అది పెద్ద వెలితయ్యే. పైగా మన సంస్కృతి అయ్యే.. అందుకే కేసీఆర్ తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిండు.. లేకపోతే తెలంగాణను మొత్తం బంగారం చేసేటోడు. దెబ్బకి ప్రజలకు బంగారాన్ని ఏమి చేసుకోవాలో తెలిసేది కాదు, దాంతో తెగ పరేషాన్ అయ్యేటోరు. ఇయన్నీ దృష్టిలో ఎత్తుకుని మన గులాబోడు గిట్ల అప్పులు చేసుకుంటూ పోతుండు. మొత్తంగా తెలంగాణ రుణభారం ఇంచుమించు రూ.2 లక్షల కోట్లకు చేరిందని.. దీంతో వారసత్వంగా వచ్చిన అప్పుతో కలిపి మొత్తం అప్పు ప్రతి సంవత్సరం పెరిగిపోతుందని తెలంగాణ మేధావులు దిగులు పడుతున్నారు.
పైగా మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, డబుల్ బెడ్రూం ఇళ్లకు ఇంకా వేల కోట్ల అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి. వీటికి తోడు విద్యుదుత్పత్తి, పంపిణీని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం అమల్లోకి తెచ్చిన ఉదయ్ పథకంలో చేరడంతో రూ.8,923 కోట్ల డిస్కంల అప్పు ప్రభుత్వ ఖజానాకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఏమైనా అప్పులు తెచ్చేందుకు ముందు నుంచీ మన కేసీఆర్ సారూ చాలా ఉత్సాహం చూపడంతో రుణభారం తడిసి మోపెడైపోతుంది. ఇలా ఆదాయం కంటే ఖర్చులే అధికం అయిపోయి, ఒక రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్తే.. చివరికి రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) కూడా అప్పు ఇవ్వనని వేలేస్తోంది.
అయినా గిప్పుడు ఈ అప్పుల కుప్ప గెదుకంటే.. మన తెలంగాణ అప్పు రూ.69517 కోట్ల ఉంటే.. మన ఉద్యమ కింగ్ కేసీఆర్ అధికారం చేపట్టినాక లక్షల కోట్లకు అప్పు పాకిందని ఆ మధ్య బీజేపీ వాళ్ళు తెగ విమర్శించారు. అయితే తాజాగా రానున్న రెండు నెలల్లో ఈ అప్పు ఇంకా పెరగనుందట. కొన్ని పథకాల అమలుకు అప్పు తప్పని సరి అని.. అప్పు కోసం కేసీఆర్ సారూ ప్రయత్నాలు చేస్తుండు. గైతే గీ ఇషయాన్ని గులాబీ బాస్ పెద్దగా పట్టించుకోట్లా.. ఎవరైనా నాయకులూ చెప్పే ప్రయత్నం చేస్తే.. గీసువంటివి పట్టించుకోకూడదు భయ్ అని మన కేసీఆర్ సారు సెలవిస్తున్నారట.