ఈ ఏడాదిలోనే మీడియాకు ఇంకో చేదు కబురు. ఇప్పటికే విజయక్రాంతి పత్రిక మూసేశారు. రాజ్ న్యూస్ ఛానెల్ను కోమటిరెడ్డి వాళ్లు వదిలేయడంతో ఇప్పుడు ఆ ఛానెల్లో పనిచేసే జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇక ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్. మోజో టీవీని మూసేశారు. ఈ మేరకు ఈ చేదు వార్తను జర్నలిస్టులకు చేరవేశారు కూడా. కాకుంటే ఏమన్నా ఇస్తారేమోనని మోజోలో పని చేసిన జర్నలిస్టులందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద 160 జర్నలిస్టు కుటుంబాలున్నాయి. సరే ఈ మోజో ఛానల్ పెట్టినప్పటి నుంచి వివాదాస్పద వార్తలతోనే సాగింది.
శబరిమల ఇష్యూతో ఈ ఛానెల్ బాగా పాపులర్ అయ్యింది. అక్కడకు ఇద్దరు యాంకర్లను కూడా పంపించి మరీ చరిత్రకెక్కింది. చర్చల్లో హమారా ప్రసాద్ అనే దళిత వ్యక్తిని అవమానించినట్టు.. ఆయన కూడా ఈ చానల్ మాజీ సీఈవో రేవతిపై కేసు కూడా పెట్టారు. ఇక టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ అరెస్టు... ఆ తర్వాత వ్యవహారాల్లో మోజో టీవీ వ్యవహారం బాగా వార్తల్లోకి వచ్చింది. ఆ ఛానల్ సీఈవో రేవతి ఎంత హడావుడి చేసినా.. చివరకు టీవీ 9కు అప్పగించాల్సి వచ్చింది.
మోజోను బలవంతంగా స్వాధీనం చేసుకున్న టీవీ 9 యాజమాన్యం.. చివరకు ఇదే ఛానల్ను వదిలించుకోవాలని అనుకున్నది. అందుకే ఈ ఛానల్ను మూసేసిస్తున్నట్టు జర్నలిస్టులకు తెలిపింది. ఇక ఈ ఛానెల్ ఉద్యోగులు చేసేదేం లేక ఉద్యోగంలో చేరిన సమయంలోని అగ్రిమెంట్ అమలు చేయమని కోరుతున్నారు. అగ్రిమెంట ప్రకారం.. ఉద్యోగులకు మూడు నెలల వేతనం చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై సోమవారం స్పష్టత ఇస్తామని టీవీ 9 యాజమాన్యం చెప్పిందని సారాంశం.
ఇక ఈ యేడాది మే 4న విజయక్రాంతి అనే ఏడాది వయసున్న దినపత్రిక మూతపడింది. ఆ దినపత్రిక మూతపడిన సమయంలో 100 మంది జర్నలిస్టుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పుడెవరూ స్పందించలేదు. ఇప్పుడెవరూ స్పందించరు. పక్కవాడి కష్టాలు ఎన్నోకష్టాలకు నోర్చి ప్రజలకు చూపించే తెలుగు జర్నలిస్టుల బాధలు మాత్రం ఎవ్వరికి పట్టడం లేదు.