- ప్రతిపాదన 1941లో ... ప్రారంభం 2004లో ... 2021 నాటికి పూర్తయ్యే అవకాశాలు
పోలవరం ప్రాజెక్ట్ రాజకీయ నాయకుల చేతుల్లో పాశుపతాస్త్రంగా మారింది. 1941 లో అంకురార్పణ జరిగిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ బాలారిష్టాలనే ఎదుర్కొంటోంది. రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి పోలవరం ప్రస్తావన తీసుకురావటంతో ఈ ప్రాజెక్ట్లో గత తెలుగుదేశం ప్రభుత్వం కాజేసిన రూ.2000 కోట్ల ప్రజాధనాన్ని గుర్తు చేసుకోవటం పాఠకుల వంతైంది.
రాష్ట్రంలో నాలుగు ప్రధాన జిల్లాలకు ఆధారమైన పోలవరం ప్రాజెక్ట్ పట్ల ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.? ఎప్పటి నుంచి ఈ జాగారం జరుగుతోందని..? పరిశీలిస్తే... గోదావరి నదీ ప్రవాహాన్ని స్థిరీకరించి అక్కడ నుంచి నీటిని మళ్లించడం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలవుతుందని అందుకు పోలవరం వద్దనే ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుకూలస్థలంగా 1941లో అప్పటి నిపుణులు గుర్తించారు.
అప్పటి నుంచి ప్రతిపాదిత పోలవరం అంధ్ర ప్రదేశ్ జీవనాధారంగా పిలువ బడ్తుంది. సర్ ఆర్థర్ కాటన్ భారతదేశపు నదుల అనుసంధానం గుఱించి ప్రాథమిక సూచనలు చేసినప్పటికీ, 1930-40 ల వరకూ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 1941 లో, మద్రాసు రాష్ట్ర ప్రధాన ఇంజనీరు, దివాన్ బహుద్దూర్ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్, గోదావరి నదిపై పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించాడు. 1946-47లో ప్రఖ్యాత ఇంజనీరు కె.ఎల్ .రావు ప్రాజెక్టు అంచనాలు రూపొందించారు.
అనేక బాలారిష్టాలను ఎదుర్కొన్న ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్ట్ 2004 లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించబడింది. 2015లో జాతీయ ప్రాజెక్టు గా గుర్తించబడి, 2017 జూన్ నాటికి పురోగతి దిశగా పనులు కొనసాగాయి. గోదావరికి ఒకవైపున తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలోని మెట్టప్రాంతాలున్నాయి. మరోవైపున పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు గోదావరి తప్ప మరొక నీటివనరు లేదు.
వర్షాభావ పరిస్థితులలో ఈ నాలుగు జిల్లాలు కరుపు పరిస్థితులకు ప్రభావితమవుతుంటాయి. ఈ ప్రాంతాలలో ప్రవహించే ఏర్లు, నదులు పూర్తిగా వర్షాధారితం కావటంతో వాటిపై రైతులు అంతగా ఆధారపడలేరు. ఈ ప్రాంతాలకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయటం ద్వారా నమ్మకమైన నీటి వనరును రైతులకు అందించవచ్చని నిపుణులు అంచనాలు రూపొందించారు. కాగా గత తెలుగుదేశం పార్టీ అవినీతి కార్యకలాపాల నేపద్యంలో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్కు దారితీసింది.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిచేసినట్టైతే సుమారు 80 ఏళ్ల నాటి ప్రతిపాదనకు ప్రాణం పోసినవారవుతారని రాజకీయ నిపుణలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని సూచిస్తున్నారు.