పొగడ్తలకు మోడీ పొంగిపోరు, విమర్శలకు క్రుంగిపోరు, కానీ ఆయన కార్య దీక్ష వేరు. పట్టుదల వేరు, ఆయన సొంత జీవితం వదులుకుని రాజకీయాల్లొకి వచ్చింది ఏదో ఒకటి చేయాలని, భారతమాత ముద్దుబిడ్డగా తన పేరు చరిత్రలో నిలుపుకోవాలని. మోడీలోని ఈ ద్రుఢ దీక్షకు మెచ్చే జనం రెండు సార్లు ఆయనకు పట్టం కట్టారు. అంతకంతకు ఆయన సీట్లు, ఓట్లు పెంచుకుపోతున్నారు. మోడీ అందరిలాంటి రాజకీయ నాయకుడు కాడన్నది మాత్రం అటు ప్రజలకు, ఇటి రాజకీయ వర్గాలకు బాగా అర్ధమవుతోంది.
ఇదిలా ఉండగా చాలా కాలం తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ మోడీని అభినందించారు. కాశ్మీర్ విభజన ద్వారా మోడీ గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన కొనియాడారు. మోడీ నిర్ణయం దేశ సమగ్రతకు సమైక్యతకు ఎంతగానో ఉపయోగపడుతుందని పవన్ అన్నారు. ఇకపై పాక్ లో శాంతి, సామరస్యం నెలకొంటాయని ఆయన అంటూ, పాక్, భారత్ సంబంధాల మధ్య కూడా కొత్త శకం మొదలవుతుందని ఆయన అన్నారు.
సరిగ్గా మూడేళ్ళ క్రితం మోడీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజిని పాచిపోయిన లడ్డూలతో సరిపోల్చిన పవన్ ఆ తరువాత కాలంలో మోడీపై పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ఘాట్ కామెంట్స్ చేసారు. మోడీ ఉత్తర, దక్షిణ భారతాల మధ్య తేడా చూపిస్తున్నారని కూడా ఆయన అన్నారు. మోడీ అంటే తనకు భయం లేదని కూడా చాలా సందర్భాలలో పవన్ అన్నారు. ఇపుడు పవన్ స్వరం మారడం వెనక కారణాలు ఏంటన్నవి చూడాలి.
నిజానికి ఎన్నికల వేళ ముస్లిముల విషయంలో పవన్ మాట్లాడుతూ వారి దేశభక్తిని తాను అనుమానించనని, బీజేపీ వారి కంటే తనకు దేశభక్తి నిండుగా ఉందని చెప్పుకున్నారు. ఇంతలో ఇలా అయన మాట్లాడడం, అందునా ముస్లిం స్టేట్ గా ఉన్న కశ్మీర్ వంటి సున్నితమైన దాన్ని విడగొట్టిన నేపధ్యంలో వామ పక్ష భావజాలం తనలో ఎక్కువగా ఉందన్న పవన్ బీజేపీని ఇలా సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కొత్త రాజకీయ బంధాలను తెరపైకి తెస్తోంది.