సంచలన రీతిలో, విపక్షాలు తేరుకునేంత సమయం కూడా ఇవ్వకుండగా మెరుపు వేగంతో జమ్ముకశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పించే అధికరణం 370ని అనూహ్యం గా కేంద్రం రద్దుచేసింది. ఆర్టికల్ 370, దానిలో అవిభాజ్యంగా ఉన్న ఆర్టికల్ 35-ఏ కాలగర్భంలో కలిసిపోయాయి. జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది. దీంతో 72 ఏళ్ల సమస్యకు ఓ పరిష్కారం చూపినట్టయిందని కేంద్రం పేర్కొంది. ఈ తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ వెంటనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గెజిట్ విడుదల చేశారు. మెరుపు వేగంతో ఈ ఆపరేషన్ పూర్తవడంలో మన తెలుగు అధికారి అత్యంత కీలక పాత్ర పోషించారు.
సోమవారం కొన్ని గంటల వ్యవధిలోనే...ఢిల్లీ కేంద్రంగా జమ్ముకశ్మీర్కు సంబంధించిన పరిణామాలు వేగంగా జరిగిపోయిన సంగతి తెలిసిందే. ముందుగా సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర మంత్రులు పార్లమెంట్కు బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా రాజ్యసభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులంతా లేచి నిలబడి స్వాగతం పలికారు. ఆయన సభలో ఇతర బిల్లులతోపాటు ఆర్టికల్ 370 రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరినీ షాక్కు గురిచేశారు. అంతకుముందే ఆర్టికల్ 370 రద్దుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయం సోమవారం నుంచే అమల్లోకి వస్తుందంటూ గెజిట్ జారీ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన గెజిట్ పత్రాలను అమిత్షా సభ్యులందరికీ అందించారు. దీంతో జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తిని కోల్పోయింది.
ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనపై మొదటి నుంచీ గోప్యత పాటించిన కేంద్ర ప్రభుత్వం.. బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టేవరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రక్రియ...ఈ బిల్లులో ఎంలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకోవడంలో కీలక పాత్ర పోషించింది కేంద్ర న్యాయ, శాసన వ్యవహారాల శాఖ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ జి. నారాయణ రాజు. అచ్చ తెలుగువాడైన నారాయణ రాజు 2015లో ఈ కీలక విభాగానికి సెక్రటరీగా నియమితులయ్యారు. న్యాయవ్యవహారాలలో విశేష అనుభవంతో పాటుగా చట్టాలు రూపొందించడంలో దిట్ట. అందుకే ఈ కీలక ఆపరేషన్కు ఆయన్ను మోదీ-షా ఎంచుకున్నారు. గుట్టుగా, కేంద్రం కోరుకున్నవిధంగా,విశ్వసనీయతతో ఆయన ఈ పని చక్కబెట్టారు.