సోషల్ మీడియాలో దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఎంత చురుకుగా ఉండేవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి వ్యక్తిని ఓ నెటిజన్ తప్పుగా కామెంట్ చేస్తే...ఆమె అలాగే స్పందించారు. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాంగే రామ్ మరణించిన సమయంలో ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. అయితే ఇర్ఫాన్ ఖాన్ అనే ఓ ప్రబుద్ధుడు సుష్మా ట్వీట్పై స్పందిస్తూ.. ‘షీలా దీక్షిత్ లానే మిమ్మల్ని కూడా ఏదో రోజు దేశమంతా తల్చుకుంటుంది అమ్మా’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సుష్మా స్పందన నెటిజన్లను ఆకట్టుకుంది.
జూలై 20న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మరణించారు. ఈ సమయంలో చనిపోయాక సుష్మాజీని కూడా అలానే తల్చుకుంటారని చెప్తూ ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్ అతనికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. ‘నా గురించి ఇంత అత్యున్నతమైన ఆలోచన చేసినందుకు నీకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. సుష్మా సమాధానం పట్ల నెటిజన్లు ఆనందం వ్యక్తం చేయడమే కాక ఇర్ఫాన్ను విపరీతంగా ట్రోల్ చేశారు. తప్పుడు ట్వీట్ చేసిన వాడికి సైతం తగు రీతిలో స్పందించారని ప్రశ్నించారు. ఇదిలాఉండగా, ఇదిలాఉండగా, మంగళవారం గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. సుష్మా కన్నుమూయడంతో...దేశం ఆమెను స్మరించుకుంటూ ఇటు ఆన్లైన్లో అటు ఆఫ్లైన్లో తమ సంతాపాన్ని తెలుపుతోంది.
ఇక తాజాగా ఆమె చివరిసారిగా కశ్మీర్ విభజనపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన జీవితకాలంలో ఇటువంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, సుష్మా మరణంపై ప్రధానమంత్రి తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.