భార‌తదేశ 73వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జాతిని ఉద్దేశించి భారత రాష్ట్రప‌తి  రాం నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఆయన మాటల్లోనే... 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మీ అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశంలో, విదేశాలలో నివసిస్తున్న భారతమాత ముద్దుబిడ్డలు అందరికీ ఇది సంతోషకరమైన, ఉద్విగ్నభరితమైన రోజు. వలసపాలన నుంచి మనకు విముక్తి కలిగించి స్వాతంత్ర్యం సంపాదించిపెట్టేందుకు ఎన్నోకష్టనష్టాలకు వోర్చి వీరోచిత పోరాటాలు, త్యాగాలు చేసిన  అసంఖ్యాక సమరయోధులను, విప్లవవీరులను మనం కృతజ్ఞతతో స్మరించుకుంటున్నాము. ఇప్పుడు ఒక ప్రత్యేక తరుణంలో మనం స్వతంత్ర జాతిగా 72 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. ఇప్పటినుంచి కొద్దివారాలలో అక్టోబర్ రెండవ తేదీన మనం మన జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని జరుపుకోనున్నాము.  మన జాతి స్వేచ్చావాయువులు పీల్చేందుకు సాగిన ఉద్యమం విజయవంతం కావడానికి, సమాజంలోని అసమానతలు తొలగించేందుకు జరిగిన సంస్కరణ యత్నాలకు   ఆయన మార్గదర్శిగా దారిచూపారు.
 


ఇప్పుడు మనం చూస్తున్న సమకాలీన ఇండియాకు మహాత్ముడు నివసించిన, పనిచేసిన ఇండియాకు ఎంతో తేడావుంది. అయినప్పటికీ ప్రస్తుతానికి కూడా గాంధీజీని అన్వయించుకోవచ్చు. ప్రకృతితో మమేకమై సామరస్యంతో జీవించాలని, పర్యావరణ సంవేదన అవసరమని ఆయన సమర్ధించడానికి కారణం ఈనాడు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళను ఆనాడే ఊహించడంవల్లనే. మనదేశంలో అభాగ్యులైన సహచర పౌరులు, కుటుంబాలకు మనం సంక్షేమ కార్యక్రమాలు రూపొందించినప్పుడు, సూర్యుని నుంచి వచ్చే సౌరశక్తిని అక్షయఇంధనంగా వినియోగించినప్పుడు మనం గాంధీతత్వాన్ని కార్యరూపంలో పెడుతున్నా మన్నమాట. శతాబ్దాలుగా దేశవాసులను ఎంతగానో ప్రభావితం చేసిన మహనీయుడు, జ్ఞాని గురునానక్ దేవ్ గారి  550 వ జయంతి కూడా ఈ సంవత్సరంలోనే జరుగనుంది.  ఆయన సిక్కు మత స్థాపకుడు.  అయితే అయన పట్ల ఉన్న పూజ్యభావం, గౌరవం కేవలం సిక్కు మతస్తులకే పరిమితం కాలేదు. దేశంలో, విదేశాలలో కోట్లాదిమంది ఇతరులకు కూడా విస్తరించింది.ఈ శుభ సందర్బంలో వారికి నా శుబాభినందనలు.
 

 
 స్వాతంత్ర్య సమరంలో ముందునడచి శ్రమించిన కీర్తిమంతులైన తరం వారు స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ అధికార మార్పిడి అని భావించలేదు. దానిని జాతి నిర్మాణానికి, కలయికకు  సాగే సుదీర్ఘ, విస్తృత ప్రక్రియకు తొలిమెట్టుగా వారు భావించారు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, మొత్తం మీద సామాజిక జీవనం మెరుగుపడాలన్నది వారి ఉద్దేశం. ఈ నేపధ్యంలో జమ్మూ – కాశ్మీర్ మరియు లద్దాక్ లలో ఇటీవల జరిగిన మార్పులు ఆ ప్రాంతాల వారికి ఏంతో ప్రయోజనకరం కలగాలని నేను విశ్వసిస్తున్నాను. ఇకపైన వారు కూడా దేశంలోని మిగిలిన ప్రాంతాలలో నివసించే తమతోటి పౌరులవలె  ఒకే రకమైన హక్కులు, ఒకే విధమైన విశేషాధికారాలు, ఒకే రకమైన సౌకర్యాలు  పొందే అవకాశం ఉంటుంది. వాటిలో ప్రగతిశీల, సర్వజన సమానత్వ శాసనాలు మరియు విద్యాహక్కు, సమాచార హక్కు, విద్య, ఉద్యోగాలలో  రిజర్వేషన్లు, అనాదిగా అణగారిన సామాజిక వర్గాల వారికి  ఇతర సౌకర్యాలు, ముమ్మారు తలాఖ్ వంటి సమానత్వం కాని ఆచారాల రద్దు ద్వారా  ఆడపడుచులకు న్యాయం చేకూర్చే నిబంధనలు ఉన్నాయి.


 
ఈ ఏడాది వేసవిలో భారత ప్రజలు మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన 17వ సాధారణ ఎన్నికలలో పాల్గొన్నారు. ఇందుకు నేను వోటర్లను అభినందిస్తున్నాను.  వారు పోలింగ్ స్టేషన్లకు అధిక సంఖ్యలో, ఉత్సాహంతో తరలివచ్చారు. ఆ విధంగా వారు తమ వోటు హక్కును వినియోగించుకొని పౌరులుగా తమ బాధ్యతను నెరవేర్చారు. ప్రతిఎన్నిక ఒక ఆరంభానికి గుర్తు. ప్రతిఎన్నిక భారతావని సమీకృత ఆశలు, ఆకాంక్షల నవీకరణ వంటిది. ఆ నమ్మకం, ఆశావాదం స్వాతంత్ర్యం సిద్దించిన 15 ఆగస్టు, 1947న దేశాప్రజలందరూ అనుభవించినటువంటిది.  ఇప్పుడు మన దేశంలోని ప్రతి ఒక్కరూ కలసికట్టుగా కృషిచేసి మనజాతిని సమున్నత శిఖరాలకు తీసుకెళ్ళాల్సిన తరుణమిది. ఇందుకు సంబంధించి ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల సందర్బంగా లోకసభ, రాజ్యసభ  చాలా ఎక్కువ రోజులు సమావేశం కావడమే కాక ఉపయుక్తమైన నిర్ణయాలు జరిగాయి.  పార్టీల మధ్య సహకార స్ఫూర్తి, నిర్మాణాత్మక చర్చల ద్వారా పలు ముఖ్యమైన బిల్లులను ఆమోదించడం జరిగింది. రానున్న ఐదేళ్ళలో జరిగే పరిణామాలకు ఇది కేవలం సూచిక మాత్రమే.  ఇదే సంస్కృతి మన దేశంలోని అన్ని అసెంబ్లీలకు కూడా ప్రసరించాలని కూడా నేను కోరుతున్నాను.



 
ఇది ఎందుకు ముఖ్యమైంది?  వోటర్లు విశ్వాసం ఉంచి ఎన్నుకున్న వారందరూ సమానంగా ఉండాలనే భావన వల్ల మాత్రమే అది ముఖ్యం కాదు. జాతి నిర్మాణం - - ఎడతెగక సాగే ప్రక్రియ కావడం వల్ల,  స్వాతంత్ర్యం దానిలో కీలకమైన మైలురాయి కావడం వల్ల అది ముఖ్యమైంది – కోసం ప్రతి సంస్థ మరియు ప్రతి భాగస్వామి కలసికట్టుగా పనిచేయవలసి ఉంటుంది.  చివరికి జాతినిర్మాణం అంటే వోటర్లకు మరియు వారి ప్రతినిధులకు మధ్య, పౌరుకలు మరియు వారి ప్రభుత్వానికి మధ్య, మరియు పౌర సమాజానికి మరియు రాజ్యానికి మధ్య అనుకూల భాగస్వామ్యం నెలకొనడమే. రాజ్యం, ప్రభుత్వం కూడా ఒకరు సదుపాయాల సంధాతగా, మరొకరు అందుకు కావలసిన సామర్ధ్యాన్ని సమకూర్చే ముఖ్య భూమికను నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల మన కీలక సంస్థలు, విధాన రూపకర్తలు పౌరులు పంపే సందేశాలను అధ్యయనం చేసి వారి ఆలోచనల్లోని గుణదోషాలను ఎంచి తగిన రీతిలో ప్రతిస్పందించాల్సి ఉంటుంది.  భారత రాష్ట్రపతిగా దేశమంతటా -- వైవిధ్యంగా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలలో — పర్యటించే, వివిధ రంగాలకు చెందిన సహచర పౌరులను కలుసుకునే ప్రత్యేకఅధికారం నాకు ఉంటుంది. భారతీయుల రుచులు, అభిరుచులు వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్తును గురించి అందరి ఒకే విధంగా ఉంటాయి. 1947కు ముందు అందరూ స్వేచ్చా భారతాన్ని గురించి  కలగనేవారు.  ఈ నాటి కలలు సత్వర అభివృద్ధి కోసం; సమర్ధవంతమైన మరియు పారదర్శకామైన పాలన కోసం, అయినప్పటికినీ మన దైనందిన జీవితంలో ప్రభుత్వానికి సంబంధించిన చిన్న అడుగుజాడైనా ఉండాలని కలగంటాం.
 



 ఈ స్వ‌ప్నాల‌ను పండించ‌డం అత్యంత అవ‌స‌రంగా ఉంది.  ప్ర‌జ‌లు ఇచ్చిన‌టువంటి తీర్పు ను బ‌ట్టి చూస్తే వారి యొక్క ఆకాంక్ష‌లు ఏమిట‌న్న‌ది విశ‌ద‌మ‌వుతుంది.  ప్ర‌భుత్వానికి అది పోషించ‌వ‌ల‌సిన‌టువంటి పాత్ర అనివార్యం గా ఉన్నప్పుడు 130 కోట్ల మంది భార‌తీయుల యొక్క నైపుణ్యం, ప్ర‌తిభ‌, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, సృజ‌నాత్మ‌క‌త ల‌తో పాటు, న‌వ పారిశ్రామిక‌త్వ అంశాల లో ఒక గొప్ప శ‌క్తి మ‌రియు అవ‌కాశం ఉన్నాయ‌ని నేను అంటాను.  ఈ అంశాలు కొత్త‌వి ఏమీ కాదు.  వారు భార‌త‌దేశాన్ని క‌దం తొక్కిస్తున్నారు.  అంతేకాదు, వారు వేలాది సంవ‌త్స‌రాలుగా మ‌న నాగ‌ర‌క‌త ను పెంచి, పోషించుకుంటూ వ‌చ్చారు.  మ‌న ప్ర‌జ‌లు ఇక్క‌ట్టుల‌ను మ‌రియు సవాళ్ళ‌ను ఎదురొడ్డిన కాలాలు మ‌న సుదీర్ఘ‌మైన‌టువంటి చ‌రిత్ర లో ఉన్నాయి.  అటువంటి సంద‌ర్భాల లో సైతం మ‌న స‌మాజం ప‌ట్టు విడువ‌క త‌న‌ను తాను నిరూపించుకొంది.  సాధార‌ణ‌మైన‌టువంటి కుటుంబాలు, అసాధార‌ణ‌మైన‌టువంటి ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శించాయి.  మ‌రి ఎంతో మంది కృత నిశ్చ‌యం క‌లిగిన‌టువంటి వ్య‌క్తులు మ‌నుగ‌డ సాగించే, ఇంకా వ‌ర్ధిల్లే శ‌క్తిని చాటారు. ప్ర‌స్తుతం ఒక అనుకూల‌మైన‌టువంటి మ‌రియు సౌక‌ర్య‌వంత‌మైన‌టువంటి ప‌ర్యావ‌ర‌ణాన్ని ప్ర‌భుత్వం అందిస్తున్నందువ‌ల్ల మ‌న ప్ర‌జ‌లు సాధించ‌గ‌లిగేది ఏమిటి అనేది మ‌నం ఇట్టే ఊహించ‌వ‌చ్చు.
 



పారదర్శకమైన, సమీకృత బ్యాంకింగ్ వ్యవస్థ, స్నేహపూర్వక (ఆన్లైన్) పన్నుల విధానం, సహేతుకమైన పారిశ్రామికవేత్తలకు సులభంగా పెట్టుబడి లభించే సదుపాయం ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఆర్ధిక మౌలిక సదుపాయాలను నిర్మించవచ్చు.  సమాజంలోని నిరుపేదవర్గాల వారికి ప్రభుత్వం గృహనిర్మాణం రూపంలో భౌతిక మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు. ప్రతి ఇంటిలో విద్యుత్తు, మరుగుదొడ్లు, మంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయవచ్చు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు,  మరికొన్ని ప్రాంతాలలో మంచి నీటి కొరత వంటి వైరుధ్య పరిస్థితులు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంస్థాగత మౌలిక సదుపాయాలను కల్పించవచ్చు.  విశాలమైన రహదారులు, వేగంగా, సురక్షితంగా గమ్యానికి చేర్చే రైళ్ళు  దేశంలోని మారుమూల ప్రాంతాలలో విమానాశ్రయాలు, తీర ప్రాంతాలలో ఓడరేవులు నిర్మించడం ద్వారా ప్రభుత్వం ప్రాంతాల మధ్య సంధాయకతకు దోహదం చేసే మౌలిక సదుపాయాలను నిర్మించవచ్చు. మరియు  అదే విధంగా డిజిటల్ ఇండియా ద్వారా సామాన్య పౌరులు కూడా సార్వత్రిక డేటా నుంచి ప్రయోజనం పొందేలా చేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: