కాదేదీ కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అందువల్ల రాజకీయానికి ఏది అనవసరం కాదు. మన ఘనత వహించిన నేతలు ఉండగా ప్రతీదీ ఆయుధమే అవుతుంది. ఆఖరుకు పేక ముక్క కూడా కత్తి మాదిరిగా నిలబడి కలబడి పోరాడుతుంది. హుందా అన్నది కానరాని ప్రెజెంట్ పాలిటిక్స్ లో పేక ముక్క సైతం రఫ్ఫాడించేస్తోంది.
పేకాటరాయుళ్లను పట్టుకుని అరెస్ట్ చేయడం కూడా ఇపుడు రాజకీయ రచ్చకు దారితీస్తోంది. గోదావరి జిల్లాల్లో పేకాట పెద్ద సరదా. పోలీసులకు వారిని పట్టుకెళ్ళి లోపలేయడం మరో సరదా. ఇది ఎపుడూ ఉన్నదే. లేటెస్ట్ గా మకిలిపురంలో కొందరు పేకాటరాయుళ్ల మీద పోలీసులు దాడి చేసి స్టేషన్ కి తీసుకెళ్ళారు. అందులో తన మద్దతుదాడున్నాడని రాజోలు ఎమ్మెల్యే జనసేనకు చెందిన రాపాక వర ప్రసాదరావు పోలీసులతో గొడవ పడడం, అది చిలికి చిలికి గాలివానగా మారడం జరిగింది.
దాంతో రాపాక అరెస్ట్ అయ్యారు. ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకోవాలని పవన్ రెడీ అయిపోవడమే అసలైన కామెడీ, ట్రాజడీ కూడా. పేకాట ఆడడం తప్పో ఒప్పో పవన్ చెప్పరు, స్టేషన్ మీద దాడి చేయడం కరెక్టో కాదో అంతకంటే చెప్పరు, కానీ రాపాక అరెస్ట్ మాత్రం తప్పు అంటారు. నిన్నటికి నిన్న మధ్యపాన నిషేధం అసలు కుదరదని, అమలు చేయడం కష్టమని పవన్ అనడం వివాదాస్పదమైంది. ఏది తాగాలో మరేది తినాలో పాలకులు నిర్ణయిస్తారా అంటూ పవన్ చేసిన కామెంట్స్ మద్యపాన ప్రియులకు అనుకూలంగా ఉన్నాయని రాష్ట్ర అబ్కారీ మంత్రి నారాయణస్వామి గట్టిగా కౌంటర్ కూడా ఇచ్చారు.
ఇక రాపాక అరెస్ట్ తో ఇపుడు పేకాట బాబులకు కూడా పవన్ బాబు మద్దతు ఇచ్చారా అన్న సెటైర్లు పడుతున్నాయి. ఇక్కడ కామెడీ ఏంటి అంటే ఉన్నది ఒక్క ఎమ్మెల్యే. ఆయన్ని జగన్ తన పార్టీలోకి తీసుకోవడానికి ఇలా చేస్తున్నారని పవన్ ఆరోపించడం. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్ కి ఈ అవసరం ఎందుకు ఉంటుంది బొత్తిగా కామెడీ కాకపోతేనూ. సరే పవన్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎక్కువగానే రియాక్ట్ అయ్యారనుకుంటే ప్రతిపక్ష నేత చంద్రేబాబు, ట్విట్టర్ బాబు లోకేష్ కూడా అయ్యో ఎంత ఘోరం జరిగింది. ఇదేం అన్యాయమని గగ్గోలు పెడుతున్నారు. పవన్ అడగకపోయినా మద్దతు ఇస్తున్నారు. ఈ ఘనత వహించిన ప్రతిపక్ష నాయకులు ఇంతకీ చెప్పాల్సిన జవాబు ఒకటి ఉంది. పేకాటరాయుళ్ళను అరెస్ట్ చేయవద్దా. పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తే కేసులు పెట్టవద్దా. మరీ చిన్న విషయాలకు కూడా జగన్ మీద పడి ఏడ్వడానికి విపక్షం రెడీ అయిపోవడమే అసలైన ట్రాజడీ.