ఆంధ్రప్రదేశ్ కు అధిక నిధులను కేటాయించి ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా లేదు ... పార్టీ అధికారంలోకి రావడం తో పదవులను ఆశిస్తున్న నాయకులు, ఇప్పటికీ ముఖ్యమంత్రి తమకు పదవులను కేటాయించలేదని అసంతృప్తితో ఉన్నారు. ఇక మంత్రి వర్గం లో స్థానం ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలైతే తాము అధికార పార్టీ నుంచి గెలిచామన్న విషయాన్ని విస్మరించినట్లు కన్పిస్తోంది . ఇప్పటికే పలువురు మంత్రులను పిలిచి ముఖ్యమంత్రి క్లాసులు పీకడం తో పలువురు అమాత్యులు సైతం ఒకింత గుర్రుగానే ఉన్నారు . ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రకృతి మాత్రం తాను అనుకూలంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచింది.
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని జలాశయాలకు వరద పోటెత్తడంతో, సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలా కన్పిస్తున్నాయి . గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోగా, ఇప్పుడు ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొమ్మిదేళ్లు పని చేసినప్పుడు రాష్ట్రం కరువు, కాటకాలతో అల్లాడిపోయింది . చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు, కాటకాలు వస్తాయని , ఆయన కరువు- కవలపిల్లలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రోజా లాంటి నేతలు సైతం వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెల్సిందే .
అయితే వ్యక్తులకు వ్యక్తులకు వర్షాలకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా నాటి నుంచి బాబు అధికారం లో ఉంటే వర్షాలు కురవవన్న అభిప్రాయాన్ని ప్రజల మనసుల్లో సుస్థిరం చేసేందుకు ఎప్పటికప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్ధులు ప్రయత్నిస్తూనే ఉన్నారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాబు ఓడిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ కు వరుణదేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడం దాదాపు పదేళ్ల నుంచి నిండని జలాశయాలు కూడా నేడు పూర్తిస్థాయి నీటితో కళకళల ను సంతరించుకున్నాయి . దీనితో సహజంగానే జగన్ అదృష్టవంతుడు అన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది.