ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల నుంచి కూడా ప్రశంసలు పొందుతున్నారు. కేవలం రెండున్నర నెలల పాలనలో తమకు రాజకీయంగా బద్ధ శత్రువులుగా ఉన్న పార్టీ నేతలే కాకుండా... ప్రజా ప్రతినిధుల నుంచి సైతం ఆయన ప్రశంసలు పొంది ఉండటం విశేషం. కొద్ది రోజుల క్రితం ఏపీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జగన్ను అసెంబ్లీ సాక్షిగా ఆకాశానికి ఎత్తేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వైసీపీని ఏపీలో పదేపదే టార్గెట్ చేస్తున్న బిజెపికి చెందిన ఎమ్మెల్యే జగన్ను ప్రశంసించడం విశేషం. తెలంగాణ అసెంబ్లీలో బిజెపికి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్.
గోసంరక్షణ, హిందూ ధర్మ ప్రచారం విషయంలో ఎంతకైనా తెగించే రాజాసింగ్ తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇటీవల తిరుపతి నుంచి కొండ పైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర - క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ దర్శనమిచ్చాయి. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. దీంతో తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని పెద్ద ఎత్తున కలకలం రేగింది. అయితే వెంటనే రియాక్ట్ అయిన టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఇదంతా గత ప్రభుత్వం చేసిన తప్పే అని.. తమకు సంబంధం లేదని ప్రకటించారు.
ఈ వివాదంపై చివరకు హిందూ ధర్మసంఘాల నుంచి విమర్శలు రావడంతో జగన్ తీవ్రంగా తీసుకున్నారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అన్యమతస్తులను రాష్ట్ర కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణకు చెందిన గోషామహల్ ఎమ్మెల్యే - బీజేపీ నేత రాజాసింగ్ స్పందించారు. టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినపుడు ఆగ్రహం వ్యక్తం చేసిన రాజాసింగ్ తాజాగా ఏపీ సీఎం జగన్ స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపించారు.
జగన్ తీసుకున్న నిర్ణయంపై రాజాసింగ్ కితాబిచ్చారు. ఆయన చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తన స్పందనను ట్విట్టర్లో వ్యక్తీకరిస్తూ.. సనాతన ధర్మం - హిందూ ఆలయాల పరిరక్షణ అంశంలో వైఎస్ జగన్ నిర్ణయాన్ని విమర్శించిన బీజేపీ నేతే...తిరిగి ప్రశంసించడం జగన్ దక్కించుకున్న ప్రత్యేకత అని పలువురు పేర్కొంటున్నారు.