జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించాలన్న ఏకైక టార్గెట్ తో పని చేస్తుండటంతో
తెలుగుదేశంపార్టీ పరువు పోగొట్టుకుంటోంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
మూడు నెలల్లోనే టిడిపికి చాలా ఎదురు దెబ్బలే తిగిలింది. అయినా తన పద్దతి
మార్చుకోకుండా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకోవటమే విచిత్రంగా ఉంది.
గడచిన మూడు నెలల్లో చాలా అంశాల్లో టిడిపి పరువు పోగొట్టుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఎదుదరైన ఘోర పరాజయాన్ని చంద్రబాబునాయుడు, లోకేష్ తట్టుకోలేక పోతున్నారు. దాంతో ఉక్రోషం కొద్దీ పదే పదే జనాలను జగన్ పైకి రెచ్చ గొట్టేందుకు ప్రయత్నిస్తు భంగపడుతోంది.
టిడిపి పరువు పోగొట్టుకున్న కొన్ని ఘటనలను చూద్దాం. తిరుమలకు వెళ్ళే బస్సుల్లో జగన్ ప్రభుత్వం అన్యమత ప్రచారం చేస్తోందంటూ బురద చల్లాలని ప్రయత్నించారు. తీరా ఆరా తీస్తే ఆ టిక్కెట్లు చంద్రబాబు సిఎంగా ఉండగా ప్రింట్ అయినవే అని తేలిపోయింది. తిరుమల కొండల్లో చర్చి కడుతున్నారంటూ మరో పుకారు లేవదీశారు. తీరా చూస్తే అది ఉత్త పుకారే అని తేలిపోయింది.
మొన్నటి వరదల్లో రైతులకు సహాయం అందటం లేదంటూ ఓ రైతుతో నోటికొచ్చినట్లు తిట్టించారు. తీరా చూస్తే అది రైతు కాదని టిడిపి పెయిడ్ ఆర్టిస్టని తేలిపోవటంతో నోరు మూసేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల తన ఇంట్లోను, క్యాంపు కార్యాలయంతో పాటు కొడుకు షోరూములో వాడేసుకున్న విషయం బయటపడింది. దాంతో టిడిపి పరువు చాలా దారుణంగా దెబ్బతినేసింది.
ధర్మపోరాట దీక్షలతో చంద్రబాబు ఢిల్లీలో ఆడిన నాటకాలకు టిటిడి నిధులు వాడేశారన్న విషయం బయపడింది. మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాస్ అక్రమ మైనింగ్ చేయటం లేదని ప్రభుత్వం వాదించింది. స్వయంగా కోర్టు జోక్యం చేసుకుని యరపతినేనిది అక్రమ మైనింగే అని తేల్చటంతో మళ్ళీ నోరెత్తలేదు.
కరకట్టమీద చంద్రబాబు ఇంటిపై ఎగిరిన ద్రోన్ల విషయంలో చంద్రబాబుతో పాటు నేతలు చేసిన యాగీ అందరికీ తెలిసిందే. తీరా ఆ ద్రోన్లు తమకు మద్దతుగా నిలిచే మీడియా వాళ్ళవే అని తేలిపోవటంతో తేలుకుట్టిన దొంగల్లాగ నోరెత్తటం లేదు. రైతులకు విత్తనాలు అందించలేని అసమర్ధప్రభుత్వం అంటూ ఒకటే గోల చేశారు. తీరా రైతులకు విత్తనాలు అందకపోవటానికి చంద్రబాబు నిర్వాకమే కారణమని తేలిపోవటంతో పరువు పోయింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలాసార్లే పరువు పోగొట్టుకుంది. టిడిపికి ఎప్పటికి బుద్ది వస్తుందో ?