పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసేసిందన్న వార్తలు కూడా నిజం కాదంటోంది భారత్ విదేశాంగ శాఖ. కేవలం కొన్ని రూట్ లు మాత్రమే తాత్కాలికంగా నిలిపేశారని స్పష్టత ఇచ్చారు అధికారులు. ఎందుకు కొన్ని రూట్ లు బ్లాక్ చేశారో పాకిస్తాన్ సమాధానం చెప్పాలన్నారు. కశ్మీర్ లో క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటోందని చెప్పింది విదేశాంగ శాఖ. 85 శాతం జమ్ముకశ్మీర్ లో పగటిపూట ఆంక్షలు లేవని చెప్పింది. కశ్మీర్లో ఎలాంటి ఉద్రిక్తత నెలకొనకుండా.. స్థానిక ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఖాళీలు భర్తీ చేస్తామని గవర్నర్ ప్రకటించారని, అక్టోబర్ నాటికి బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికలు కూడా పూర్తవుతాయని క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్ తో సంబంధాలు బాగుండాలనే తాము కోరుకుంటున్నామని, కానీ వాళ్లు మాత్రం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని భారత్ ఆరోపించింది.
మరోవైపు రాహుల్.. పొలిటికల్ జువైనల్ అంటారొకరు..! గవర్నర్ పోస్టుకు అనర్హుడంటూ కౌంటరిస్తారు మరొకరు. జమ్మూకశ్మీర్ గవర్నర్, కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధమిది. ఇంతలా వివాదం చెలరేగడానికి కారణమేంటీ..? జమ్మూకశ్మీర్ గవర్నర్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. కశ్మీర్ విషయంలో రాహుల్ గాంధీ పొలిటికల్ జువైనల్లా వ్యవహరిస్తున్నారంటూ సత్యపాల్ మాలిక్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ ఓ రేంజ్లో మండిపడింది. సత్యపాల్ మాలిక్.. గవర్నర్ పోస్టుకు అనర్హుడంటూ విరుచుకుపడింది. గవర్నర్గా ఉంటూ.. రాజకీయ నేతగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని విమర్శించింది కాంగ్రెస్.
కశ్మీర్ లోయలో పరిస్థితిపై సమీక్షించిన గవర్నర్... రాహుల్ గురించి మాట్లాడటం తనకు ఇష్టముండదన్నారు. ఎందుకుంటే ఆయన గొప్ప కుటుంబానికి చెందిన పిల్లాడంటూ సెటైర్ వేశారు. అంతేకాదు.. కశ్మీర్ విషయంలో రాజకీయ బాల నేరస్తుడిగా ప్రవర్తిస్తున్నారంటూ హాట్ కామెంట్లు చేశారు సత్యపాల్ మాలిక్. అసలేం జరిగిందంటే... కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ...పాక్ యూఎన్వోను ఆశ్రయించింది. మొన్న రాహుల్ గాంధీ శ్రీనగర్ పర్యటనను ప్రస్తావిస్తూ.. కంప్లయింట్ చేసింది. ఆ రోజు రాహుల్ చేసిన కామెంట్లను హైలెట్ చేసింది. కశ్మీర్లో పరిస్థితులకు రాహుల్ వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయని వెల్లడించింది పాక్. దీనిపై వివాదం రాజుకోవడంతో రాహుల్ గాంధీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.