ఎక్కడ చూడు అవినీతి..ఏ నాయకున్ని చూడు అవినీతి..అవినీతి అవినీతి అంటూ రోజుకు మనం లెక్కలేనన్ని సార్లు వింటువుంటాం.కాని పెద్దగా పట్టించుకోం ఎందుకంటే మనకు అలవాటైంది కనుక,చిన్న చేపని పెద్ద చేప తింటే దాన్ని మరోచేప తింటుంది,ఇలా ఇది చైన్ మార్కెట్ నెట్వర్క్లా విస్తరించింది.ఎన్ని సార్లు దాడులు చేసినా,ఎంత సొమ్ము సీబీఐ వాళ్లు పట్టుకెళ్లినా మిగతావారికి కూసింతైన భయం భక్తి వుండవు,ఎందుకంటే అది అవినీతి సొమ్ము కనుక ఎంత పోతే అంతకు ఎక్కువ దోచుకోవచ్చుగనక.ఇక ఇలాంటి అవినీతి పరుల భరతం పట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది.దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేస్తోంది.ఏకకాలంలో 150 ప్రాంతాల్లో సోదాలు చేపడుతోంది.భారీ స్థాయిలోనే అవకతవకలను పాల్పడిన శాఖలను గుర్తించిన సీబీఐ ఆయా శాఖలపై ప్రత్యేకదృష్టి సారించింది.
వాటిలో శ్రీనగర్ తో సహా 30 నగరాల్లో దాదాపు 150 ప్రభుత్వ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయని సీబీఐ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు.రైల్వే,బీఎస్ఎన్ఎల్, షిప్పింగ్,విమానాశ్రయాల ప్రాధికార సంస్థ,బొగ్గు,ఆహార, కస్టమ్స్, విద్యుత్,మున్సిపల్,కంటోన్మెంట్,అగ్నిమాపక,పరిశ్రమలు, జీఎస్టీ,రవాణా,విదేశీ వాణిజ్యం,పురావస్తుశాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకులు తదితర విభాగాల్లో సీబీఐ తనిఖీలు చేపడు తున్నారు.హైదరాబాద్,శ్రీనగర్,దిల్లీ,జైపూర్,జోధ్పూర్,గువహటి,షిల్లాంగ్, చండీగఢ్,సిమ్లా,చెన్నై,మధురై, కోల్కతా,బెంగళూరు,బాంబే, పుణె,గాంధీనగర్, గోవా,భోపాల్,జబల్పూర్, నాగ్పూర్,పట్నా,రాంచీ,ఘజియాబాద్,డెహ్రాడూన్, లఖ్నవూ,వడోదర,అహ్మదా బాద్,కొచ్చి నగరాల్లో సీబీఐ సోదాలు సాగుతున్నట్లు అధికారి వెల్లడించారు.
అయితే,దేశ వ్యాప్తంగా సీబీఐ ఆకస్మిక సోదాలకు గల కారణాలేంటో తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఈ దాడులు రహస్యం గానే జరుగుతున్నాయట.ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరంను సీబీఐ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగిస్తూ కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ హై ప్రొఫైల్ కేసులో విచారణ చేస్తుండగానే దేశవ్యాప్తంగా 150 చోట్ల అది కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.