ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అత్యంత హైడ్రామా మధ్య ఆయన నివాసంలోనే... సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిదంబరానికి నాలుగు రో్జులపాటు కస్టడీ విధించగా గడువు శనివారంతో ముగుస్తుండగా చిదంబరం కస్టడీ గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 2 వరకు సీబీఐ కస్టడీలో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కోర్టు మరోసారి చిదంబరం కస్టడీని పొడిగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం కాదని, ఏపీని విభజించిన చిదంబరానికి ఇప్పుడు ఏగతి పట్టిందో అందరికీ తెలుసన్నారు. రెండో రోజు అమరావతిలో పర్యటించిన పవన్... వైసీపీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని చెప్పడం దారుణమని, గత ప్రభుత్వంపై కోపంతో ప్రజల్ని ఎందుకు శిక్షిస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తు చేశారు. ఈ సందర్భంగానే ఆయన చిదంబరం ప్రస్తావన తీసుకువచ్చారు.
మెజార్టీ ఉందని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి పవర్ స్టార్ సూచించారు. గత ప్రభుత్వంపై ఉన్న కోపంతో రాజధాని మార్చితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు పవన్ కల్యాణ్. జగన్ వినకుంటే... మోడీ, అమిత్షాను కలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. జగన్ సర్కార్ ఇసుకతో ఆడుకుంటోందని, ఇసుకతో ఆడుకున్న గత ప్రభుత్వానికి పట్టిన గతే వైసీపీకి పడుతుందని హెచ్చరించారు.ఇప్పటికైనా ఇసుక కొరత మీద చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మరోపక్క వైసీపీ గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. కాలం కలిసొచ్చిందో, ఈవీఎంలు కలిసొచ్చాయో గానీ.. వైసీపీ మాత్రం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు . 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏం చేసినా చెల్లుతుందనే దోరణి నుంచి బయటపడాలని సూచించారు.