ఏపీలో మరో అవినీతి బాగోతం వెలుగు చూసింది.. ఇటీవల ఇలాంటిదే తెలంగాణలోనూ వెలుగు చూసింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈఎస్‌ఐ లో అవినీతి రాజ్యమేలుతోందని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఏపీలో తాజాగా వెలుగు చూసిన ఈ కుంభ కోణంపై దర్యాప్తు కోసం ఏపీ సర్కారు వెంటనే ఆదేశాలు జారీ చేసింది.


ఏపీలోని ఈఎస్‌ఐలో జరిగిన రూ.300 కోట్ల మేర అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లులో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మంత్రుల అండదండలతో​ మందులను సరఫరా చేయకుండానే బిల్లులను నమోదు చేసి పెద్ద ఎత్తున అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు.


అవసరంలేని, గడువు ముగిసిపోయే మందులను సరఫరా చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఆస్పత్రులకు మందులు సరఫరా చేయకుండానే కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సరఫరాదారులతో అధికారులు కుమ్మకమయ్యారు. ఈఎస్‌ఐ కార్యాలయం అద్దెలోనూ పెద్ద ఎత్తున​ అక్రమాలు చోటుచేసుకున్నాయి.


ఈ కుంభకోణంలో రూ.300 కోట్లకు పైగా సొమ్మును స్వాహా చేసుకున్నారని గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. దీంతో ఈఎస్‌ఐ అవినీతిపై విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి జయరామ్‌ శనివారం అధికారులను ఆదేశించారు. ఈ విచారణ బాధ్యతను కార్మిక శాఖ డైరెక్టర్‌కు అప్పగించారు.


ఇప్పటికే ఏపీలో టీడీపీ నేతల బాగోతాలు క్రమంగా బయటపడుతున్నాయి. మరోవైపు.. రాజధాని ప్రాజెక్టులు సహా, పోలవరం విషయంలోనూ భారీగా అవినీతి జరిగిందని జగన్ ప్రభుత్వం అనుమానిస్తోంది. వీటిపై ఓ కమిటీ దర్యాప్తు కూడా చేస్తోంది. మొత్తం మీద.. ఈ పరిణామాలు చూస్తుంటే.. గత ఐదేళ్లలో పసుపు చొక్కాలు బాగానే రెచ్చిపోయి అవినీతి సాగించినట్టు అర్థమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: