ప్రేమ పేరుతో లోబర్చుకొని ...మతం మార్చి పెళ్లి చేసుకొని ఇప్పుడు దళితురాలనే నింద వేయడం...తక్కువ కులం పేరుతో వేధించడం చేస్తూ....లవ్ జిహాద్కు పాల్పడిన ఘటనపై కఠినంగా వ్యవహరించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమించి.. మాతం మార్చుకుని పెండ్లి చేసుకున్న యువతిని.. భర్త వేధిస్తున్నాడని, వేధింపులు తీవ్ర కావడంతో బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొంటున్నారు. కలకలం సృష్టించిన ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం....వరంగల్ వర్ధన్నపేట్కు చెందిన క్రిష్ణవేణి, పరకాలకు చెందిన రఫిక్ 2012 లో హన్మకొండలో కంప్యూటర్ విద్య అభ్యసించే సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. హిందూ మతంలో ఉంటే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రఫీక్ నో చెప్పాడు. దీంతో అమ్మాయి మతం మార్పిడి చేయించాడు. 2013లో హైదరాబాద్ మలక్పేట్లో క్రిష్ణవేణి మతం మార్చి ఆమె పేరును షబానగా మార్చాడు. అనంతరం వివాహం చేసుకుని అక్కడే ఉన్నారు. 2016లో మల్కాజిగిరి సర్కిల్, మల్లికార్జుననగర్కు మకాం మార్చారు. ప్రస్తుతం షబాన నాలుగు నెలల గర్భిణి. అయితే, పిల్లలు వద్దని రఫీక్.. భార్యను వేధిస్తుండేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో షబాన జూలైలో మల్కాజిగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కౌన్సెలింగ్ అనంతరం కొద్ది రోజుల పాటు ఇద్దరు కలిసి ఉన్నారు.
అయితే రఫీక్ బుద్ధి మారలేదు. మళ్లీ భార్యను రఫీక్ వేధిస్తున్నాడు. దీంతో హన్మకొండలో ఉమెన్స్ పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. రఫీక్కు కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరిని కలిపారు. కొద్ది రోజుల తర్వాత తక్కువ కులం అంటూ దూషిస్తూ, కట్నం రాలేదని వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు మంగళవారం మల్కాజిగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రఫీక్పై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు వరకట్నం వేధింపుల కేసు నమోదు చేశారు.