ఎన్నో దేశాలు మరెన్నో ప్రయత్నాలు.. అంతకు మించి ఆశలు.. వాటన్నింటిని నెరవేర్చబోతున్నది ఇండియా. అవును. ఇప్పటి వరకు ఏ దేశం చేయని సాహసం ఇండియా చేసింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 మరికొద్ది గంటల్లోనే చంద్రుని దక్షిణ ధృవంపై అడుగిడబోతున్నది. ఈ అపూర్వమైన క్షణాల కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇప్పటి వరకు ఎన్నో దేశాలు చంద్రునిపైకి ఉపగ్రహాలను పంపాయి. అన్ని కూడా చంద్రుని మధ్యభాగంలోనే దిగాయి కానీ, దక్షిణ దృవం వైపు చూడలేదు.
దక్షిణ ధృవం చీకటిగా ఉంటుంది. తక్కువ వెలుగు ఉంటుంది. అక్కడ పరిశోధనలు చేయడం చాలా కష్టం అని మిగతా దేశాలు చంద్రుని మధ్యభాగంపైన పరిశోధనలు చేస్తున్నాయి. చంద్రయాన్1 ప్రయోగం తరువాత ఇండియా మొదటిసారి దక్షిణ ధృవంలో నీటి జాడలు ఉన్నాయని కనిపెట్టింది. దశాబ్దాల తరబడి స్పేస్ లో ప్రయోగాలు చేస్తూ, ప్రపంచంలో తామే గొప్ప అని చెప్పుకుంటున్న దేశాలు ఈ వార్త విని షాక్ అయ్యాయి. వేగంగా అభివృద్ధి చెందిన చైనా చంద్రునిపై ప్రయోగాలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది.
సెప్టెంబర్ 7 వ తేదీ అర్ధరాత్రి 12:30 నుంచి 1:45 గంటల మధ్యలో చంద్రయాన్ 2 చంద్రునిపై అడుగిడబోతున్నది. ఆర్బిటర్ నుంచి ఇప్పటికే ల్యాండర్ విడిపోయింది. గంటకు ఆరువేల కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేస్తున్న ఈ ల్యాండర్ వేగాన్ని మెల్లిగా తగ్గిస్తూ వస్తున్నారు. ఈ ప్రక్రియ లాండర్ చంద్రునిపై ల్యాండ్ కావడానికి 15 నిమిషాల ముందు నుంచి ప్రారంభం అవుతుంది. క్రమంగా వేగం తగ్గించి ముందుగా నిర్దేశించిన మాంజినస్ సి, సీంపెలియస్ ఎస్ అనే బిలాల మధ్య ల్యాండ్ అవుతుంది.
ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయంలో ఇండియా నుంచి ల్యాండర్ కు సంకేతాలు వెళ్ళాలి అంటే మూడు సెకన్ల సమయం పడుతుంది. ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి. అందుకే లాండర్ లో స్వయం నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ల్యాండ్ అయ్యేందుకు అందులోని కంప్యూటర్ సిగ్నల్స్ వ్యవస్థ, సెన్సార్ వ్యవస్థ, కెమెరాలు పనిచేస్తాయి. ల్యాండ్ అయ్యేందుకు ఆ రెండు బిలాల మధ్య అనువైన ప్రాంతాన్ని చూసుకొని ల్యాండ్ అవుతుంది.
ఇలా ల్యాండ్ అయ్యే సమయంలో చంద్రుని ఉపరితలం నుంచి దుమ్ము ధూళి ఎక్కుగా పైకి లేస్తుంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే 15 నిమిషాల సమయం చాలా కీలకం. ఒకసారి ల్యాండర్ విక్రమ్ ల్యాండ్ అయిన తరువాత దుమ్ము ధూళి సర్దుకోటానికి 4 గంటల సమయం పడుతుంది. ఈలోపు అక్కడ ల్యాండర్ విక్రమ్ స్థితి గతులను పరిశీలిస్తారు. ల్యాండ్ అయ్యే సమయంలో అక్కడి దృశ్యాలను ల్యాండర్ లో అమర్చిన కెమెరాల ద్వారా ఇస్రో కంట్రోల్ కేంద్రానికి పంపుతుంది. వాటిని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ల్యాండర్ ల్యాండ్ అయిన 4 గంటల తరువాత విక్రమ్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. అయితే, రోవర్ నుంచి సిగ్నల్ డైరెక్ట్ గా భూమికి చేరలేవు. రోవర్ నుంచి ఆర్బిటర్ కు సిగ్నల్స్ ను పంపుతుంది. ఆర్బిటర్ నుంచి భూమికి సిగ్నల్ చేరుతాయి.