మరికొన్ని గంటల్లో చంద్రునిపై ఒక గొప్ప ఆవిష్కరణ జరగబోతున్నది. జులై 22 వ తేదీన శ్రీహరి కోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ రాకెట్ వివిధ దశల్లో విడిపోతూ వచ్చింది. కొన్ని రోజుల క్రితం చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన తరువాత దిశలను మారుస్తూ వేగాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి తరువాత అంటే సెప్టెంబర్ 7 తేదీన 12:30 గంటల నుంచి 1:45 గంటల మధ్యలో చంద్రయాన్ 2 ల్యాండర్ చంద్రునిపై దిగబోతున్నది.
ఈ అద్భుతమైన ఆవిష్కరణ కోసం ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్నది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ఇప్పటికే ప్రపంచం సిద్ధం అయ్యింది. కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయేందుకు రెడీ అవుతున్నారు. ఇస్రో దీనికోసం అన్ని ఏర్పాట్లు చేసింది. పైగా ల్యాండర్ దిగే సమయంలో దానంతట అదే స్వీయ నిర్ణయాలు తీసుకుంటూ ల్యాండ్ కాబోతున్నది. ఇప్పటి వరకు స్వీయ నిర్ణయాలు తీసుకుంటూ, అవసరానికి, పరిస్థితులకు తగిన విధంగా స్థితి, గతులను మార్చుకునే ఉపగ్రహాలను ఏ దేశం ప్రయోగించలేదు.
ఈ విషయంలో టెక్నాలజీలో అభివృద్ధి సాధించిన ఇజ్రాయిల్ దేశం కూడా వెనకడుగు వేసింది. భూమినుంచి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి ఆ దేశం ప్రయోగించిన ల్యాండర్ ల్యాండింగ్ సమయంలో కూలిపోయిన సంగతి తెల్సిందే. ఆ విషయం తెలిసిన ఇండియా, స్వయంగా నియంత్రణ కలిగిన ప్రొగ్రమింగ్ ను అందులో ఇన్ ఫుట్ చేశారు. ఏ విధంగా ఈ ప్రోగ్రామింగ్ పనిచేస్తుందని విషయం మరికాసేపట్లో తేలిపోతుంది.
ల్యాండర్ లాండింగ్ జరిగిన నాలుగు గంటల తరువాత ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. రోవర్ బయటకు వచ్చే సమయంలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. దక్షిణ దృవంపై 15డిగ్రీల కోణంలో ఈ కిరణాలు ప్రసరిస్తాయి కాబట్టి, వాటిని ఒడిసిపట్టుకోవడానికి రోవర్ లో ఉండే సోలార్ ప్లేట్స్ 90డిగ్రీల కోణంలో ఫిక్స్ చేశారు. దీంతో రోవర్ ఈజీగా రీఛార్జ్ అవుతుంది. ల్యాండర్ ఎలా ల్యాండ్ అవుతుంది. రోవర్ నుంచి ఎలాంటి సంకేతాలు వస్తాయి అనే విషయం రేపు ఉదయం వరకు తేలిపోతుంది.