ఇస్రో శాస్త్రవేత్తలు అంకితభావం, సాహసోపేతమైన కృషి ప్రపంచానికి మరో సరి వెల్లడైందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొనియాడారు. చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా ఇస్రో బృందం శ్రేష్ఠమైన పనితీరును కనబరిచిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. భవిష్యత్లో సంపూర్ణ విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. చంద్రుడికి అతిసమీపంలోకి వెళ్లిన ల్యాండర్ నుంచి సంకేతాల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ అందకపోవడంతో.. శాస్త్రవేత్తల్లో తీవ్ర నిరాశ నెలకొన్నది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు సవ్యంగా సాగిన ల్యాండర్ ప్రయాణం.. అక్కడి నుంచి సంకేతాలు ఆగిపోయాయి. దీనితో శాస్త్రవేత్తల్లో మనోధైర్యాన్ని నింపుతూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ట్విట్టర్ ద్వారా రాష్ట్రపతి స్పందించారు.
అంతకుముందు విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ అందకపోవడంతో ఇస్రో సెంటర్లో టెన్షన్ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలనుద్దేశించి మీది చిన్న అచీవ్మెంట్ కాదన్నారు. మీ కృషి ఎంతో నేర్పిందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు మానవజాతికి ఉత్తమ సేవచేశారన్నారు. చాలా దిగులుగా కనిపించిన శాస్త్రవేత్తల్లో మోదీ జోష్ నింపే ప్రయత్నం చేశారు. నేను మీవెంటే ఉంటానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ధైర్యంతో ముందకు వెళ్దామన్నారు. మళ్లీ మరికొన్ని ప్రయత్నాలతో ముందుకు వెళ్దాం అన్నారు. అక్కడ ఉన్న శాస్త్రవేత్తలతో మాట్లాడారు. ఆల్ ద బెస్ట్ అని మోదీ తెలిపారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. భవిష్యత్తు ప్రయోగాల కోసం బెస్ట్ విషెస్ చెప్పారాయన. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన ట్వీట్లో రియాక్ట్ అయ్యారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ప్రతి ఒకరిలోనూ మీరు అంతరిక్ష అవగాహన పెంచినట్లు ఆమె పేర్కొన్నారు. మీ కఠోర శ్రమ, పట్టుదల దేశం గర్వపడేలా చేశాయని కాంగ్రెస్ తన ట్వీట్లో తెలిపింది. ఈ యావత్ దేశం ఇస్రో వెంటే ఉందని కాంగ్రెస్ పార్టీ తన ట్వీట్లో పేర్కొన్నది. .