యాదాద్రిలో శిల్పాలపై చిత్రాల వివాదం ముగిసింది. అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్‌తో పాటు ఎలాంటి రాజకీయ చిత్రాలు ఉంచకూడదని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా భారీ ఎత్తున శిల్పాలను చెక్కుతున్నారు శిల్పులు. అయితే ఆలయం బయట ఏర్పాటు చేసిన అష్టభుజి బాహ్య ప్రాకారంలో కేసీఆర్, కేసీఆర్ కిట్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు లాంటివి స్తంభాలపై కనిపించాయి. దీంతో అది రాజకీయ దుమారానికి తెరలేపింది. అయితే అది శిల్పుల ఇష్టమని యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ స్పష్టం చేసింది. ప్రస్తుత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేవి ఈ శిల్పాలని, వాటిలో రాజకీయాలు తగదని సూచించింది. ఒకవేళ తీవ్ర అభ్యంతరాలు వస్తే వాటిని తీసేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పింది.


అయినా ఈ వివాదం సద్దుమనగకపోవడంతో.. యాదాద్రి ఆలయంలో దైవ సంబంధిత చిహ్నాలే తప్ప మరే ఇతర చిత్రాలు ఉండడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్ రెడ్డి. బాహ్య ప్రాకారంలోని స్తంభాల్లో కేసీఆర్‌తో పాటు గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, కమలం పువ్వు, సైకిల్ వంటి కొన్ని రాజకీయ చిహ్నాలు కూడా ఉన్నాయి. ఆలయాల్లో వాటిని చెక్కడంపై సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, మరికొందరితో ఆయన ప్రగతిభవన్‌లో సమావేశమై చర్చించారు భూపాల్ రెడ్డి. ఆలయ ప్రాంగణంలో తన చిత్రం ఉండాలని సీఎం కేసీఆర్ కోరుకోరనీ, కేవలం దేవాలయ విశిష్టత, దైవ సంబంధిత అంశాలకు మాత్రమే శిల్పులు పరిమితం కావాలనేది సీఎం ఆకాంక్ష అని వారికి చెప్పారు భూపాల్ రెడ్డి. తక్షణం నాయకుల చిత్రాలు, పార్టీల చిహ్నాలు తొలగించాలని ఆదేశించారు. మొత్తం మీద .. 5వేల చిత్రాలను గీస్తే... అందులో రాజకీయ చిత్రాలు ఉండడం వివాదాలకు దారితీసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరికం తరహాలో వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం స్వయంగా ముఖ్యమంత్రి కార్యదర్శే అవి తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో.. వివాదం ముగిసినట్టయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: