అమరావతిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మొదలైన కలకలానికి పార్టీ నేతలు వ్యూహాత్మకంగా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని అంశంపై ఎవరూ మాట్లాడొద్దని హైకమాండ్ ఆదేశించినట్టు తెలిసింది. మంత్రి బొత్స తన విధులు తాను నిర్వహిస్తున్నారంటూ చెప్తుండగా మరికొందరు మంత్రులు రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పుకొస్తున్నారు. వైసీపీలో ఒక్కసారిగా ఇంత క్లారిటీ ఎందుకొచ్చిందని తెర వెనుక ఏం జరిగిందోనని అందరూ ఆరా తీస్తున్నారు. మిథున్ తప్పితే హితం తప్పుతుంది అన్న సామెతలో సారాంశాన్ని గ్రహించినట్టుంది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాజధాని అమరావతిపై ప్రస్తుతం ఆ పార్టీ ఒక క్లారిటీకి వచ్చిందంటున్నారు.


ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఈ వివాదానికి తెరదించక పోయినా మంత్రి వర్గ సహచరులు పార్టీ నేతలకూ కొంత స్పష్టత ఇచ్చినట్టు సమాచారమందుతోంది. సీఎం జగన్ అమెరికా పర్యటనకు వెళ్లొచ్చేలోపు వరదలకు రాజధాని మునిగిపోతుంది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ హడావుడి చేశారు. ఆయన వ్యాఖ్యలపై రాజధానిలో ప్రజలు రైతుల నుంచి తీవ్ర నిరసన ప్రారంభమైంది. ఎప్పుడు మునిగిపోయిందో చూపాలంటూ రాజధాని ప్రాంత రైతులు సవాల్ చేశారు. ఇదే తరుణంలో మంత్రి బొత్స వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీల నేతలు మండిపడ్డారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవోధర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ నేతలు కూడా రైతులకు మద్దతు ప్రకటించారు.



బీజేపీ మరో అడుగు ముందుకేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా మారుస్తారని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించింది. కొంతమంది స్వామీజీలు కూడా రంగంలోకి దిగి రాజధానిపై గళం విప్పారు. రాజధానిని మార్పు చేసి ఎలా సుఖపడతారో చూస్తామంటూ సవాల్ చేశారు. అమెరికా పర్యటన ముగించుకుని సీఎం జగన్మోహనరెడ్డి వచ్చేలోపు ఈ వ్యవహారమంతా జరిగిపోయింది. పైగా జగన్ అనుమతి లేకుండా మంత్రి బొత్స రాజధాని అంశంపై పదేపదే మాట్లాడారని కూడా ప్రచారం ప్రారంభమైంది. మొన్న మంత్రి వర్గ సమావేశం పూర్తయిన తర్వాత కొంత మంది మంత్రుల వద్ద సీఎం జగన్ రాజధాని గురించి స్పష్టత ఇచ్చినట్లుగా సమాచారం. రాజధానిని ఇప్పుడు మార్పు చేయడం కుదరదని అదే సమయంలో ప్రభుత్వం వద్ద కూడా నిధులు లేవని అమరావతిలో ఇప్పుడున్న కట్టడాలను పూర్తి చేసి సచివాలయం అసెంబ్లీని వెలగపూడిలోనే ప్రస్తుతానికి నిర్వహిద్దామని ముఖ్యమంత్రి సూచించారట.



నాగార్జున యూనివర్సిటీ సమీపంలో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి సచివాలయం శాఖాధికారుల కార్యాలయాలనూ అక్కడికే తరలిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై ఎవరూ ధ్రువీకరించలేదు. మరోవైపు హెచ్ వోడి కార్యాలయాలను జిల్లాలకు తరలిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే పాలనాపరంగా అది సాధ్యం కాదని ఐఏఎస్ లు ఇతర సీనియర్ అధికారులు ఇప్పటికే తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు వినికిడి. రాయలసీమలో పరిశ్రమలు, ఉత్తరాంధ్రలోని విశాఖలో ఐటీ, అమరావతిలో పరిపాలన ఉండేలా చేయాలని మరో ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉందట. ఈ నేపధ్యంలోనే రాజధానిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడరాదని సీఎం జగన్ సంకేతాలు పంపినట్టు చెబుతున్నారు.అయితే అగ్రనేతలు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించటం లేదు అమరావతిలో పదహారు వందల ఎకరాల్లో నిర్మించే సీడ్ కేపిటల్ అభివృద్ధి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నామని సింగపూర్ ప్రభుత్వంతో పాటు, సింబ్ కార్ప్ అసెండాస్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారమిచ్చారని ప్రచారం జరుగుతోంది.ఈ పరిణామం ఏపిలో పరిశ్రమల ఏర్పాటుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు. అందువల్లే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిందని కూడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం ముందుముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: