కశ్మీర్ యాపిల్స్‌కు ఉన్న గిరాకీ అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా యాపిల్స్ పండించే రైతులకు తీపి కబురు అందించింది కేంద్ర సర్కార్. అయితే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అనంతరం జమ్మూకశ్మీర్‌లో అమలు చేస్తున్న పౌర, రవాణా ఆంక్షలతో అక్కడ యాపిల్ కొనుగోళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఆపిల్ తోటల పెంపకందారుల ఆదాయం తీవ్రంగా దెబ్బతింది. భారీ నష్టాలు సైతం చవిచూస్తున్నారు. రైతులు, వ్యాపారుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా కశ్మీర్ యాపిల్ గ్రోయర్స్‌కు శుభవార్త చెప్పింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) స్కీమ్ కింద రైతుల నుంచే యాపిల్స్‌ను నేరుగా కొనుగోలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. దీంతో  ప్రభుత్వ చర్యతో యాపిల్ రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. డెరెక్ట్ ట్రాన్స్‌ఫర్ సబ్సిడీలను నేరుగా ఆయా రైతుల అకౌంట్లలో వేయడం జరుగుతుంది. 'యాపిల్స్‌ను పండ్ల మార్కెట్లలో రైతుల నుంచి నేరుగా సేకరిస్తాం. యాపిల్స్ సేకరణ కోసం ప్రత్యేక మార్కెట్ ఇన్టర్‌వెన్షన్ ప్రైస్ స్కీమ్ అమలు చేస్తాం. 12 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్‌ను సేకరిస్తాం' అని సమాచార, ప్రచార శాఖ డైరెక్టరేట్ ఓ ట్వీట్‌లో పేర్కొంది. కాగా, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) నేతృత్వంలో యాపిల్స్ సేకరణ ప్రయత్నాలు ప్రారంభమై, గుర్తింపు పొందిన రాష్ట్ర ఏజెన్సీల ద్వారా మొత్తం ప్రక్రియ డిసెంబర్ 15 కల్లా పూర్తవుతుందని హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర హోం శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.

 

జమ్మూకశ్మీర్ యాపిల్ రైతులు, విలేజ్ చీఫ్‌లు, అగ్నికల్చరల్ మార్కెటర్లు గత వారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. లోయలో రవాణా ఆంక్షల కారణంగా పంటకు తగిన రేటు రావడం లేదని, తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తోందని వారరు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతినిధుల బృందానికి అమిత్‌షా హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: