పలు కారణాలతో అవయవాలు కోల్పోయిన వారికి భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత్ సమితి చేయూత నిస్తోంది.అంగవైకల్యం చెందిన వారిని అక్కున చేర్చుకుంటోంది. ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నం ఎంపీపీ కాలనీలోను భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత్ సమితి ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరం నిర్వహిస్తున్న సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత్ సమితి కార్యక్రమాలన్నీ సంప్రదిస్తే కృత్రిమ అవయవాలను అందజేస్తున్నారు. శిబిరంలో ముందుగా బాధితులను గుర్తిస్తారు. వారికి ఎలాంటి అవయవాలూ అవసరం ఏ పరికరాలు అవసరం అనేది నమోదు చేసుకుంటారు. కృత్రిమ అవయవాలు అవసరమైన బాధితుల కాళ్లు లేదంటే చేతుల కొలతలు తీసుకుంటారు.
ఆ తరువాత బాధితులకు సరిపోయేలా అవయవాలను అందిస్తారు. భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత్ సమితి సేవల పట్ల దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పునర్జన్మ ఇస్తున్న సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక దాతల సహకారంతోనే బాధితులకు కృత్రిమ అవయవాలు అందించగలుగుతున్నామని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సమాజంలో సాటివారికి సాయం అందించడంలో తృప్తి ఉంటుంది. భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత్ సమితి కూడా అదే పని చేస్తోంది. బాధితులకు కృత్రిమ అవయవాలు అందిస్తే వాళ్లు చేతనైన పని చేసుకొని జీవిస్తారు. ఆత్మ విశ్వాసంతో తమ జీవితాన్ని గడుపుతారు, దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు ఇస్తున్న భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత్ సమితి పై ప్రశంసల వర్షం కురుస్తోంది.