తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని పలనాడులోని కొంతమంది వ్యక్తులను మరొక వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేయడంతో వారంతా గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకున్నారు. శిబిరాల్లో తలదాచుకున్నంత కాలం ఎవరు కూడా ముందుకు రాలేదు. దానిపై ఫిర్యాదులు చేయలేదు. కానీ, ఎప్పుడైతే, చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని తలపెట్టారో అప్పుడే వైకాపా కూడా అదే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.
దీంతో ఈ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బాబును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో పల్నాడు ఏరియాలో 144 సెక్షన్ విధించారు. ఈ 144 సెక్షన్ ను విధించడంతో తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడిన సంగతి తెలిసిందే. 144 సెక్షన్ ను విధించడానికి మనం జమ్మూ కాశ్మీర్ ఉన్నామా అని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటె, బాబు చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ప్రకటించిన రోజున అందరికంటే ముందుగా ఆత్మకూరుకు చేరుకుంది బాబు విశ్రాంతి తీసుకునే క్యారీవ్యాన్. బాబు అక్కడికి వస్తున్నారని చెప్పి.. హైదరాబాద్ నుంచి ముందుగానే ఆ వ్యాన్ ఆత్మకూరు వెళ్ళింది. అక్కడ ఆ క్యారీవ్యాన్ ను చూసి పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే ఆ వ్యాన్ ను రాత్రికి రాత్రి వ్యాన్ డ్రైవర్ సహాయంతో నార్కెట్ పల్లి తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. డ్రైవర్ కు డ్రైవింగ్ కు అవసరమైన తాళాలు మాత్రమే అప్పగించి, క్యారీవ్యాన్ కు తాళాలు వేసి వాటిని పోలీసులు తీసుకెళ్లారు.
దీంతో షాకైన డ్రైవర్ ఎన్టీఆర్ భవన్ కు సమాచారం అందించడంతో.. టిడిపి అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ ఇంటికి చేర్చారు. అక్కడి నుంచి బుధవారం రాత్రి తిరిగి వ్యాన్ ను హైదరాబాద్ పంపించారు. బాబు ఆత్మకూరు వస్తున్నారని చెప్పి ఆత్మకూరుకు చేరుకున్న వ్యాన్ కథ చివరకు అలా ముగిసింది. బాబును మాత్రం విజయవాడలోనే హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు శిబిరాల్లో ఉన్న వ్యక్తులను వారి స్వస్థలాలకు చేర్చడంతో.. పల్నాడు కథ సమాప్తం అయ్యింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నటు డిజిపి పేర్కొన్నారు.