మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్ననళిని తన కుమార్తె పెళ్లి ఏర్పాట్ల కోసం పెరోల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఎం. సుందరేశ్, ఎం.నిర్మల్కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఈ విషయమై జూలై 5న వాదనలు విన్న హైకోర్టు నళినికి నెల రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. దీంతో నళిని జూలై 25న జైలు నుంచి విడుదలైంది. అయితే ఈ నెల 15 నాటికి ఆమె పెరోల్ ముగియనుంది. కాగా, తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లు ఇంకా ముగియలేదని, తన పెరోల్ ను ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించాలని ఆమె హైకోర్టును కోరింది. దీంతో పెరోల్ పొడిగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఏడుగురు ముద్దాయిలు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నారు.
అయితే వేలూరు జైలు నుంచి విడులైన నళిని సత్తువాచేరిలోని ఓ ఇంట బస చేస్తూ కుమార్తె పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పెరోల్ ముగిసే సమయంలో మళ్లీ తన పెరోల్ పొడిగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ధర్మాసనం మూడు వారాలపాటు పెరోల్ పొడిగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే మళ్లీ పెరోల్ ను పొడిగించాలంటూ దాఖలైన ఆ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఇప్పటికే నళినికి రెండు విడతలుగా ఏడు వారాల పెరోల్ మంజూరు చేశామని, ఇకపై పెరోల్ను పొడిగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6 గంటల కల్లా వేలూరు జైలుకు వెళ్లాలని కూడా హైకోర్టు ఆదేశించింది.