భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. ఎన్నో జాతులు, ఎన్నో మతాలు ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలు మన దేశంలో ఉన్నాయి. హిందువులు, ముస్లింలు ఒకరంటే ఒకరికి గౌరవం ఉంటుంది. దేశంలోని అన్ని మతాల వారు సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటే అందుకు కారణం ఇదే. ఒక మనిషిని అభిమానించడం మొదలు పెడితే.. ఆ మనిషికి గుడి కట్టి పూజలు చేయడం మనం చాలాచోట్ల చూశాం. హిందువులకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.
ముస్లింలకు ఎన్నో మసీదులు ఉన్నాయి. కానీ, ముస్లిం మహిళకు ఎక్కడైనా దేవాలయం ఉన్నదా. దేవాలయంలో హిందూ దేవత, దేవుళ్లను పూజిస్తారు. కానీ, ఒక హిందూ దేవాలయంలో ముస్లిం మహిళను పూజించడం మనం ఎక్కడైనా చూశామా. లేదు. అసలు ఇలాంటి దేవాలయం భారతదేశంలో ఉందా.. ఉంటె ఎక్కడ ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లాలో ఝల్సన్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో డోలామాత అనే దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో డోలా అనే మహిళను పూజిస్తారట. దీనికి ఓ కారణం ఉంది. గతంలో ఈ ఝల్సన్ గ్రామంలో రౌడీలు దాడి చేశారు. ఆ సమయంలో డోలా అనే ముస్లిం మహిళా రౌడీలతో పోరాడి గ్రామాన్ని కాపాడింది. అయితే, ఆ సమయంలో తీవ్రంగా గాయపడిన డోలా తరువాత మరణించింది.
డోలా మరణం తరువాత.. ఆమె శరీరం ఒక పువ్వులా మారిపోయింది. దీంతో ఆ గ్రామంలోని ప్రజలందరూ.. కలిసి ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం గ్రామంలోని 7000 మంది కలిసి నాలుగు కోట్ల రూపాయలు పోగేసి.. గుడి కట్టారు. ఈ గుడిలో దేవతా విగ్రహం ఉండదు. ఒక రాయికి చీరకట్టి ఉంటుంది.
ఈ గ్రామానికి మరో చరిత్ర కూడా ఉంది. ఈ గ్రామంలోని 7000 మందిలో 1500 మంది విదేశాల్లో నివసిస్తున్నారు. విదేశాల నుంచి కూడా ప్రత్యేక సమయాల్లో ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. ప్రముఖ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఈ గ్రామానికి చెందిన మహిళా కావడం విశేషం.