దేశంలో ఆధార్ కార్డు ఎంతోమందికి ఇప్పుడు ఆధారం అయ్యింది. ఆధార్ లేకుంటే ఎలాంటి పనులు కూడా ముందుకు కదలడం లేదు. ఆధార్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతి విషయాన్ని ఆధార్ తో జతచేయడంతో.. ఆధార్ మనిషికి ఆధారంగా మారిపోయింది. మారుమూల గ్రామం నుంచి నగరం వరకు ప్రతి ఒక్కరు ఆధార్ ను కలిసి ఉన్నారు. ఆధార్ లేకుండా ఆ మనిషి లైఫ్ లో ప్రభుత్వం అందించే అన్ని రాయితీలను కోల్పోవలసి వస్తుంది.
అందుకే మనిషి అన్నింటికంటే ముందు దీనికోసమే పరుగులు తీస్తున్నారు. ఎలాంటి తప్పులు ఉన్నా వాటిని సరిచేయించుకుంటున్నాడు. అయితే, నగరాలు పట్టణాల్లో ఆధార్ కార్డు వినియోగం గురించి ప్రజలకు అవగాహన ఉన్నది. కానీ, గ్రామాల్లో ఉండే వాళ్లకు ముఖ్యంగా అడవుల్లో జీవనం కొనసాగించే వాళ్లకు ఆధార్ గురించి పెద్దగా తెలియదు. వారికీ కార్డులు అందించినా, ఆ తరువాత ఏదైనా సమస్య వస్తే పాపం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి సరిచేయించుకోవలసిన పరిస్థితి వస్తుంది.
ఒక్కోసారి ఆధార్ అనుసంధానం తరువాత కొన్ని విషయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఫోన్ నెంబర్ మారిపోవచ్చు. అప్పుడు ఆధార్ ఫోన్ నెంబర్ ను జతచేయాలి అంటే తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. మరి ఆ నెంబర్ లేకుంటే పరిస్థితి ఏంటి.. ఇదే పరిస్థితి ఎదురైంది ఓ మహిళకు, ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాలోని కోపాతుడి గ్రామానికి చెందిన సోయితా హంతల్ అనే గిరిజన మహిళ తన ఆధార్ లో మార్పులు చేయించుకోవడానికి గిరిజన గ్రామం నుంచి 80 కిమీ దూరంలో ఉన్న మల్కాన్ గిరికి వెళ్ళింది.
అంతదూరం ఎంతో శ్రమచేసి వెళ్లినా లాభం లేకపోయింది. ఆధార్ కార్డు అనుసంధానం సమయంలో ఇచ్చిన వివరాలు, ఇప్పుడు ఇచ్చిన వివరాలతో సరిగా లేకపోవడంతో కార్డును అనుసంధానం చేయలేపోయారు. దీంతో ఆమెకు నిత్యావసర సరుకుకు ఇవ్వడం ఆపేశారు. సరైన అవగాహన కల్పించకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లోని వాళ్లకు తప్పనిసరిగా అవగాహనా కల్పించాలి. లేదంటే పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.